అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Update: 2019-04-12 06:45 GMT
అనంతపురం జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మినీ బస్సు.. లారీ ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందిన వైనం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

షాకింగ్ గా మారిన ఈ రోడ్డు ప్రమాదం వివరాల్లోకి వెళితే.. కుక్కంటి క్రాస్ నుంచి కదిరి వెళుతున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్ వద్దకు చేరున్న వేళ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని చెబుతున్నారు. తనకల్లు.. నల్లచెర్వు మండలాల సమీపంలోని 42వ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ ప్రమాదానికి కారణం మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే.. మినీ బస్సు డ్రైవర్ పారిపోవటం గమనార్హం. మరణించిన వారిలో ఎక్కువమంది తనకల్లు మండలానికి చెందిన వారు ఉన్నారు.

శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని దగ్గర్లోని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ.. మిని బస్సులు రెండూ వేగంగా ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువమంది మరణించటానికి ఇదో కారణంగా చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న తనకల్లు ఎస్ ఐ ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇక.. మరణించిన వారి కుటుంబ సభ్యులు.. బంధువుల రోదనలతో ప్రమాద ప్రాంతం నిండింది.
Tags:    

Similar News