దారుణం: కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య

Update: 2020-10-03 07:00 GMT
కరోనా భయం జనాలను ఆవహించింది. అందరినీ వెంటాడుతోంది. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో రిటైర్డ్ జడ్జి రాంచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మియా పూర్ పరిధిలో చోటుచేసుకుంది.

రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్ లోని న్యూసైబర్ హిల్స్ లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రాంచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా బెడ్ రూంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా రామచంద్రారెడ్డి సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

60 ఏళ్లు పైబడిన వారంతా కరోనా వస్తే ప్రాణాలు పోతాయనే భయంతో బతుకుతున్నారు. ఇందుకు ఎవరు మినహాయింపు కావడం లేదు. ఒక అత్యున్నత స్థాయిలో ఉండే రిటైర్డ్ జడ్జి సైతం ఈ భయానికి ప్రాణాలు తీసుకోవడం విషాదం నింపింది.
Tags:    

Similar News