కలాం.. ఆ పేరే ఓ వైబ్రేషన్​.. సెన్సేషన్​ ఎందుకలా..!

Update: 2020-10-15 10:15 GMT
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్​ కలాం.. ఆయనో  మాస్​ లీడర్​కాదు, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ప్రజలు ఎన్నుకోలేదు. అనుకోకుండా రాష్ట్రపతి అయ్యారు. కానీ అందరి రాష్ట్రపతుల్లా మిగిలిపోలేదు. ఏ రాజకీయనాయకుడు అందుకోని ఖ్యాతిని గడించారు. దేశం నలుమూలల్లో ఉన్న చిన్న పాఠశాలలో సైతం ఆయన జయంతిని, వర్ధంతిని నిర్వహిస్తున్నారంటే ఆయన ఖ్యాతి ఎలా నలుదిశలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు స్కూళ్లలో కలాం చెప్పిన మాటలు కొటేషన్లుగా దర్శనమిస్తున్నాయి. ఆయన పేరుమీద వ్యాస రచనపోటీలు, ఉపన్యాస పోటీలు పెడుతున్నారు. ఆయన రాసిన పుస్తకాలు అన్ని భాషల్లోకి అనువదిస్తున్నారు. ఆయన రచనలన్నీ ఎన్నో రీప్రింట్లకు నోచుకుంటున్నాయి. ఓ సాధారణ అణువిజ్ఞాన శాస్త్రవేత్త అనుకోకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టి అసంఖ్యాకమైన అభిమానులను ఎలా సంపాదించగలిగారు. ఆయనలోని ఆ ప్రత్యేక లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..
నేడు (అక్టోబర్​ 15న) ఆయన 88వ జయంతి .. ఆయన జీవిత విశేషాలను ఓ సారి నెమరు వేసుకుందాం..

1931లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో కలాం జన్మించారు. ఐకే గుజ్రాల్​ ప్రధానిగా ఉన్న సమయంలో తొలిసారి కలాం పేరు జాతీయస్థాయిలో వినిపించింది. అప్పటికే ప్రముఖ అణుశాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్​ కలాం చాలా మందికి తెలుసు కానీ 1998 మార్చి1న గుజ్రాల్​ సర్కార్​ భారతరత్న బిరుదు ప్రదానం చేయడంతో కలాం పేరు విశ్వవ్యాప్తం అయ్యింది. నిజానికి అబ్దుల్​ కలాంకు ఆర్భాటాలు నచ్చవు. అప్పటికే పెద్ద సైంటిస్ట్​ అయినప్పటికీ సూటు, బూటు వేసుకొని అధికారిక కార్యక్రమాలకు వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. కాని తొలిసారి భయపడుతూనే అత్యున్నత అవార్డును స్వీకరించారు.

వాజపేయితో అనుబంధం

కలాంను రాష్ట్రపతిగా ఎంపికచేసిన అప్పటి ప్రధాని వాజపేయితో కలాంకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఎస్‌ఎల్‌వీ -3 పరీక్ష సక్సెస్‌ అయిన తర్వతా 1980 ఆగస్టులో తొలిసారిగా వీళ్లిద్దరూ కలుసుకున్నారు. అది కూడా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో. నిజానికి ఇందిరా గాంధీయే కలాంను వాజపేయికి పరిచయం చెసిందని చెప్పుకుంటారు. వాజపేయి రెండో సారి ప్రధాని అయ్యాక తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కలాం ను ఆహ్వానించారు.. కానీ దాన్ని కలాం సున్నితంగా తిరస్కరించారని జర్నలిస్ట్​ సర్కిళ్లలో ఓ టాక్​ ఉంది. అయితే  ఒకవేళ కలాం గనక ఆనాడు ఆఫర్​ ను స్వీకరించి ఉంటే బీజేపీ ముస్లిం వ్యతిరేక ముద్రను కొంతవరకు పొగొట్టు కునేదని కొందరి  వాదన.  కానీ రాష్ట్రపతి ఆఫర్​ను మాత్రం కలాంతిరస్కరించలేకపోయారు. ప్రధానమంత్రి కార్యాలయం మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది, మీరు వెంటనే ఆఫీసుకు రండి అంటూ.. 2002 జూన్ 10న అన్నా  యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్ కళానిధి.. ఏపీజే అబ్దుల్‌కలాంకు సందేశం పంపారు.  వెంటనే అక్కడికి చేరుకున్న కలాంకు నేరుగా దేశ ప్రధాని వాజపేయి ఫోన్​లో కలిశారు. మిమ్మల్ని రాష్ట్రపతి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. మీ అభిప్రాయం చెప్పండి అంటూ.. వాజపేయి కోరారు. అయితే అందుకు గంట సమయం కావాలంటూ కలాం కోరారు. మీరు సమయం ఎంతైనా తీసుకోండి కానీ సమాధానం మాత్రం అవును అనే రావాలి.. అంటూ చెప్పారు. దీంతో కలాం ఒప్పుకోవలసి వచ్చింది.

కలాం సూట్​ .. అదో ప్రత్యేకత
 
అధ్యక్షుడైన తరువాత ఎలాంటి దుస్తులు ధరించాలన్నది కలాంకు  పెద్ద సమస్య. కొన్నేళ్లపాటు  నీలిరంగు చొక్కా, స్పోర్ట్స్ బూట్లు ధరించిన కలాం, రాష్ట్రపతిగా వాటిని ధరించలేకపోయారు. అనేకమంది అధ్యక్షులకు సూట్లు కుట్టిన రాష్ట్రపతి భవన్‌ దర్జీ ఆయనకు కూడా కొలతలు తీసుకున్నారు. "నేను ఇందులో ఊపిరి తీసుకోలేక పోతున్నాను. ఏమైనా మార్పుకు అవకాశం ఉందా'' అని అడిగారని వెల్లడించారు. దర్జీ ఇబ్బందుల్లో పడిపోయారు. అప్పుడు కలాం మెడ దగ్గర కొంచెం కత్తిరించండని ఆయనకు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా సూట్‌ ను కలాం సూట్‌ అని పిలవడం మొదలు పెట్టారు. కలాంను కాషాయవాది అని విమర్శించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకు కారణం ఆయన జన్మస్థలమే కావచ్చు. అయితే కలాం మాత్రం నమాజ్​ చేయడంతోపాటు హిందూ సంప్రదాయ ప్రార్థనలు కూడా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన కుటుంబసభ్యులు ఎవరన్నా రాష్ట్రపతి భవన్​లో బసచేస్తే ఆయనే  బిల్లు చెల్లించేవారు. అంటే ఆయనెంత నిజాయితీ పరుడో మనం అర్థం చేసుకోవచ్చు.  "2002 నవంబర్‌లో ఒకసారి కలాం నన్ను పిలిచి ఇఫ్తార్ విందు ఎందుకు నిర్వహించాలో చెప్పు అన్నారు. ఇఫ్తార్‌ విందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలేయించారు. సుమారు రూ. పాతిక లక్షలవుతందని తేలింది."మనం ఈ డబ్బును అనాథాశ్రమానికి ఎందుకు ఇవ్వకూడదు? ఈ డబ్బు వృథా కాకుండా చూడమని నాకు చెప్పారు'' అని నాయర్‌ వెల్లడించారు.

నెమలికి కణితి ఆపరేషన్‌
డాక్టర్‌ కలాంలో మానవీయ విలువలు ఎక్కువ. ఒకసారి చలికాలంలో రాష్ట్రపతి భవన్‌ లో తోటలో నడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్‌ క్యాబిన్‌లో ఏసీ వ్యవస్థ లేదని, కఠినమైన శీతాకాలంలో కూడా సెక్యూరిటీ గార్డులకు చలిపుట్టనంతగా వేడి ఉందని ఆయన గమనించారు. సంబంధిత అధికారులను పిలిచి శీతాకాలం లో గార్డు క్యాబిన్లో హీటర్, ఎండా కాలం లో ఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.

ఒకసారి మొఘల్ గార్డెన్‌లో నడుస్తుండగా, ఒక నెమలి నోరు తెరవలేకపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే రాష్ట్రపతి భవన్‌ వెటర్నరీ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ ను పిలిచి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేయమని కోరారు. ఈ పరీక్షల్లో నెమలి నోటిలో కణితి ఉందని, అందుకే నోరు తెరవ లేకపోతోందని తేలింది. కలాం ఆదేశాలతో డాక్టర్ సుధీర్‌ నెమలికి శస్త్ర చికిత్స చేసి కణితి ని తొలగించారు.  మొత్తానికి అబ్దుల్​ కలాం ప్రజల మనిషి కావడానికి ఉదాహరణలు కోకొల్లలు.
Tags:    

Similar News