పర్ ఫెక్ట్ స్కెచ్: టైం చూసుకొని మరీ కేటీఆర్ కు సవాలు విసిరిన రాజాసింగ్

Update: 2021-10-17 04:45 GMT
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో పాలకుల్ని ఇరుకున పడేయటానికి సరికొత్త పంథాను అమలు చేస్తున్నారు వారి రాజకీయ ప్రత్యర్థులు. గతంలో ఘాటు వ్యాఖ్యలు.. ఆరోపణలు.. హడావుడి చేయటం లాంటివి చేసే వారు. కానీ.. అందుకు భిన్నంగా కాసింత స్మార్ట్ గా వ్యవహరిస్తూ ఇరుకున పడేస్తున్నారు. అంతిమంగా తమకు అవసరమైన పొలిటికల్ మైలేజీని సొంతం చేసుకుంటున్నారు.

తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే కమ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ అలాంటి పనే చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు దెబ్బ తిన్నాయి. గుంతలు పడి.. వాహనదారులకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతున్నాయి. వాహనదారుల వేగం తగ్గిపోయి.. రోడ్ల మీదకు వస్తే చాలు కిందా మీదా పడే పరిస్థితి.

ఇలాంటివేళ రాజాసింగ్ ఈ అంశంపై కీలక వ్యాఖ్య చేశారు. మంత్రి కేటీఆర్ తనతో బైక్ రైడింగ్ కు రావాలని రాజాసింగ్ చాలెంజ్ విసిరారు. వర్షం వేళ.. రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చూపిస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి మొత్తం అసెంబ్లీలో మాటలకే పరిమితమని.. వాస్తవం మాత్రం చాలా ఘోరంగా ఉందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని అంటున్నారని.. కానీ అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికు కానీ.. ప్రజలకు కాదంటూ పంచ్ విసిరారు.

రాజాసింగ్ కోరినట్లుగా మంత్రి కేటీఆర్ బైక్ రైడింగ్ కాదు కదా.. ఈ ఇష్యూ మీద కనీసం రియాక్టు కావటానికి కూడా ఇష్టపడే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న మాటను అందరికి అర్థమయ్యేలా చేసిన రాజాసింగ్ ఛాలెంజ్ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News