కేసీఆర్ అడుగుపెట్ట‌లేని చోట‌..రాహుల్ కొత్త స్కెచ్‌

Update: 2018-08-03 16:24 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం. ఒక‌నాడు ఆయ‌న‌కు అండా దండ‌గా ఉన్న ఉద్య‌మ కేంద్రం...ఇటీవ‌లి కాలంలో ఆయ‌న మంట పుట్టిస్తున్న ఇలాకా సాక్షిగా..తెలంగాణ రాజ‌కీయాల‌ను హీటెక్కించేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ణాళిక ర‌చించారు. ఈ మేర‌కు ఈనెల 14వ తేదీన జ‌ర‌గ‌నున్న త‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ను వేదిక‌గా చేసుకోనున్నారు. ఇంత‌కీ రాహుల్ అడుగు పెట్టేది ఎక్క‌డంటే...ఉస్మానియా యూనివ‌ర్సిటీలో. తెలంగాణ ఉద్య‌మంలో టీఆర్ ఎస్‌ కు  పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ఇచ్చిన ఓయూలో ఇటీవ‌ల ప్ర‌భుత్వ విధానాలు న‌చ్చ‌క ఆందోళ‌న‌లు తెర‌మీద‌కు వ‌స్తుండ‌టాన్ని గ‌మ‌నించి రాహుల్ ఈ స్కెచ్ వేశార‌ని అంటున్నారు.

తెలంగాణ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఈనెల 13న హైదరాబాద్‌ రానున్నారు.  ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ తొలిసారి రాష్ట్రానికి వ‌స్తుండ‌ట‌మే కాకుండా ఏకంగా రెండు రోజులపాటు మకాం వేసి హైదరాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల్లో జరగనున్న పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈనెల 13 - 14 తేదీలలో ప్రజా చైతన్య బస్సుయాత్రలో రాహుల్ పాల్గొంటారు. సెల్ప్‌ - హెల్ప్‌ గ్రూప్‌ ల మహిళా సభ్యులు - విద్యార్థి - యువజన - నిరుద్యోగులతో సమావేశం కానున్నారు. అలాగే రాజకీయేతర ప్రముఖులు - మేధావులు - వివిధ రంగాలలో నిపుణులైన వారితో కూడా ఆయన సమావేశమవుతారు. పార్టీ సీనియర్లతో కూడా ఆయ‌న భేటీ కానున్నారు.

అయితే, ఈ సంద‌ర్భంగా రాహుల్‌ గాంధీ పర్యటనలో ఉస్మానియా యూనివ‌ర్సిటీని కూడా చేర్చేందుకు టీ కాంగ్రెస్ నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి త‌గు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14 వ తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పర్యటన నేప‌థ్యంలో ఓయూ విద్యార్థులతో త‌న నివాసంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మావేశం అయ్యారు. ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌లో జాప్యం చేస్తున్న తీరు - ల‌క్ష ఉద్యోగాల హామీని నిలుపుకొని విధానంపై వివ‌రాలు సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కాగా - టీఆర్ ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓయూలో ప‌రిణామాలు మారుతుండ‌గా...దాన్ని కాంగ్రెస్ పార్టీ ఉప‌యోగించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా  మారింది.
Tags:    

Similar News