నిస్తేజం.. నిరుత్సాహం.. రాహుల్‌ సభ..!

Update: 2019-03-09 10:05 GMT
వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ అంటే ఒక ప్రత్యేకత. ఆ తరువాత ఆయన లేకపోయినా నాయకుల బలంతో ఎన్నికల వరకు నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ అంటేనే నాయకులు భయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ లో పరాజయం పాలైన కాంగ్రెస్‌ గత డిసెంబర్‌ లో జరిగిన ఎన్నికల్తో ఘోర అవమానాన్ని ఎదుర్కొంది. కనీస సీట్లు కూడా గెలవలేకపోవడమే కాకుండా ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో కొనసాగలేక టీఆర్‌ ఎస్‌ లోకి జంప్‌ కొడుతున్నారు.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈఎన్నికల్లోనైనా పరువు నిలుపుకునేందుకు ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను దించాలని టీపీసీసీ ప్లాన్‌ వేస్తోంది. కానీ మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు కండువాలు మారుస్తుండడంతో పార్టీ నిస్తేజంలో పడింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు..  శంషాబాద్‌ లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ లో రాహుల్‌ సభను ఏర్పాటు చేశారు.

ఈ సభకు అన్ని జిల్లాల డీసీసీలను ఆహ్వానించారు. చేవెళ్ల నుంచి ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి పోటీ చేస్తున్నందున ఆయనే ఈ సభ బాధ్యతలను మోస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - సీపీఐతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌ కు ఘోర పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తీసుకున్న నిర్ణయంతో లాభిస్తుందా అనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ వస్తున్నా కాంగ్రెస్ లో ఏమాత్రం ఉలుకూ పలుకూ లేకపోవడం విస్తుగొలుపుతోంది.

ఇక ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్‌ నాయకులకు మింగుడు పడడం లేదు. కేవలం అభివృద్ధి కోసమే అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెబుతున్నా.. టీపీసీసీలో కొందరి పెత్తనం మాత్రమే సాగుతోందని, అందుకే నాయకులు కాంగ్రెస్‌ లో ఉండలేకపోతున్నారని క్షేత్రస్థాయి నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్నీ సమస్యలను తట్టుకొని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుందోనని రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
   

Tags:    

Similar News