వంగవీటి రాధాకు అసమ్మతి సెగ

Update: 2019-03-14 11:05 GMT
వంగవీటి రాధా టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. కానీ వంగవీటి రంగా అభిమానులు మాత్రం దీన్ని ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. టీడీపీ చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వంగవీటి రంగా అభిమానులు.. ఆయన సోదరుడు నారాయణ రావు కుమారుడైన వంగవీటి నరేంద్ర ఆధ్వర్యంలో విజయవాడ రంగా విగ్రహం ఎదుట దీక్షకు దిగారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం.. దీక్షలకు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఈ దీక్షను భగ్నం చేశారు. దీంతో రాఘవయ్య పార్క్ లోని రంగా విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రంగా హత్యకు కారణమైన తెలుగుదేశంలో వంగవీటి రాధా చేరడం చాలా బాధాకరమని.. రాధా నిర్ణయం వల్ల రంగా మరోసారి హత్యకు  గురియ్యాడని ఈ సందర్భంగా నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాధా టీడీపీలో చేరడంపై రాష్ట్రవ్యాప్తంగా రాధా-రంగా మిత్రమండలి సభ్యులు ఆవేదన చెందుతున్నారని నరేంద్ర వాపోయారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాధా తండ్రి ఆశయాలను వదులుకున్నాడని మండిపడ్డారు.రాధా టీడీపీ చేరడంతో అభిమానులంతా క్షోభకు గురవుతున్నారని అన్నారు. రంగా హత్యకు కారణమైన టీడీపీలోకి రాధా చేరడంపై అభిమానులంతా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు.
Tags:    

Similar News