చిదంబరానికి కొడుకు తెచ్చిన కష్టాలు

Update: 2017-05-16 10:08 GMT
కేంద్ర మాజీ ఆర్థిక - హోం మంత్రి పి.చిదంబరం కేసులో ఊబిలో కూరుకుపోతున్నారు.. ఆయన కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్నప్పుడు కుమారుడు చేసిన రాచకార్యాలన్నీ ఆయన రాజకీయ జీవితాన్ని గందరగోళంగా మార్చేస్తున్నాయి. తాజాగా ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇల్లు సహా 14 ప్రాంతాల్లో సీబీఐ ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తోంది.
    
షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైల్లో గడుపుతున్న ఆమె తల్లిదండ్రులు ఇంద్రాణి ముఖర్జియా - పీటర్ ముఖర్జియాలకు చెందిన మీడియా కంపెనీకి లబ్ది చేకూర్చారన్న విషయమై ఈ సోదాలు జరుగుతున్నాయి.
కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్టు సీబీఐ వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. మరింత సమాచారం కోసం సీబీఐ ఇప్పుడు సోదాలకు దిగింది. ఐఎన్ ఎక్స్ మీడియా ఎఫ్ ఐపీబీ (ఫారిన్ ఎక్స్ఛేంజ్ ప్రమోషన్ బోర్డు) నుంచి రూ. 4 కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ. 10 లక్షలు లంచం తీసుకుందని, ఆపై ఐఎన్ ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ. 305 కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ డీల్స్ కుదిరినప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉండడంతో ఆయన పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది.
    
కాగా  ఇప్పటికే ఎయిర్ సెల్  - మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఆదాయపన్ను శాఖ - ఈడీ వర్గాలు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్‌ లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న  అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం కలిసి కార్తీ చిదంబరం - తండ్రి చిదంబరం ఇద్దరూ ఇరుకునపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News