శబరిమలలో మహిళలకు రక్షణ కల్పించలేం: కేరళ

Update: 2019-11-15 09:33 GMT
శబరిమల ఆలయం భక్తుల దర్శనానికి తెరుచుకుంది. పరమ పవిత్రంగా భావించే ఈ ఆలయంలోకి మహిళా భక్తుల రాకను అయ్యప్ప భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోయిన సంవత్సరం ఇది పెద్ద వివాదంగా మారి ఘర్షణకు దారితీసింది. దీంతో కేరళ సర్కారు ఈసారి అప్రమత్తమైంది.

శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించలేమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా భక్తులు శబరిమలకు రాకపోవడమే మేలు అని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తేల్చిచెప్పారు.

దట్టమైన అడవుల్లో ఉన్న శబరిమల ఆలయానికి సాధారణ భద్రత మాత్రమే ఉంటుందని.. మహిళలు వస్తే అదనపు భద్రతను కల్పించాల్సి ఉంటుందని.. ఆ పని తాము చేయలేమని కేరళ సర్కారు తేల్చిచెప్పింది.

అయితే మహిళ ఉద్యమకారులు మాత్రం శబరిమలను దర్శించుకొని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. భూమాత బ్రిగేడ్ సంస్థ సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ ఈసారి అయ్యప్ప దర్శించుకుంటామని శపథం చేసింది.

తాజాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు కనుక నిర్ణయం తీసుకుంటే ఇది పెద్ద ఘర్షణకు దారితీసే అవకాశాలుంటాయి. శాంతి భద్రతల సమస్యగా మారొచ్చని కేరళ సర్కారు అంటోంది. అందుకే శబరిమలకు వచ్చే మహిళలకు తాము రక్షణ కల్పించమని.. రావద్దని కేరళ సర్కారు తాజాగా ప్రకటన చేసింది.
Tags:    

Similar News