అమిత్‌ షా ఇక ప్ర‌శాంతంగా ఉండ‌వ‌చ్చు

Update: 2018-04-19 10:08 GMT
దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో కీల‌క తీర్పు ఒక‌టి వెలువ‌డింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ప్ర‌శాంత‌త‌ను ఇచ్చే తీర్పు కావ‌డంతో దీనిపై అంద‌రి దృష్టి ప‌డింది. సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టిపారేసింది. డ్జి లోయాది సహజ మరణమని - ఆయన మరణంపై వ్యక్తిగత విచారణ మళ్లీ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. షా నిందితునిగా ఉన్న సొహ్రాబుద్దీన్ కేసును జస్టిస్‌ లోయా విచారిస్తుండగా మరణించిన సంగ‌తి తెలిసిందే. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఆ బెంచ్‌ లో జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్ - జస్టిస్ డీవై చంద్రచూడ్‌ లు ఉన్నారు. లోయా మృతిపై విచారణ చేపట్టాలని దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నామని - ఇదే సుప్రీం చివరి తీర్పు అని కోర్టు పేర్కొంది.

2005లో జరిగిన సోహ్రాబుద్దిన్ షేక్ ఎన్‌ కౌంటర్ కేసును జడ్జి లోయా డీల్ చేశారు. ఆ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితునిగా ఉన్నారు. అయితే జడ్జి లోయా మృతి తర్వాత ఆ కేసును మరో జడ్జి విచారించారు. ఆయన షాకు ఆ కేసు నుంచి విముక్తి కల్పించారు. ఇదే స‌మ‌యంలో జ‌డ్జి మృతిపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయింది. జస్టిస్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిక్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించింది. లోయా మృతిపై మళ్ళీ విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. జడ్జి లోయా మృతిపై దాఖలైన పిటిషన్లు అన్నీ మోసపూరితమైనవని కోర్టు తెలిపింది.

సీబీఐ కోర్టు జడ్జి జస్టిస్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణకు  సుప్రీం కోర్టు తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. తీర్పుపై పిటీషనర్లలో ఒకరైన ప్రశాంత్‌ భూషణ్‌ తరవాత మీడియాతో మాట్లాడారు.  సుప్రీం కోర్టు చరిత్రలో ఇవాళ బ్లాక్‌ డేగా ఆయన అభివర్ణించారు. జస్టిస్‌ లోయా మృతి సమయంలో తాము ఉన్నామని, ఆయనది సహజమరణమని దిగువ కోర్టులో నలుగురు జడ్జీలు వాంగ్మూలం ఇచ్చిన అంశాన్ని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే వాంగ్మూలంపై నలుగురు జడ్జీల సంతకాలు లేవన్న అంశాన్ని కోర్టు పూర్తిగా విస్మరించిందని ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు.
Tags:    

Similar News