నో ప్లాస్టిక్: తిరుమ‌ల‌లో ఇక కొత్త ర‌కం వాట‌ర్ బాటిల్స్!

Update: 2020-02-18 07:30 GMT
వాట‌ర్ బాటిల్స్ కంపెనీలు నీళ్ల‌ను ఇవ్వ‌డం లేదు, ప్లాస్టిక్ ను ఇస్తున్నాయ‌నేది ఒక అభిప్రాయం. లీట‌ర్ ఇర‌వై రూపాయ‌లుగా అమ్మే ప్లాస్టిక్ బాటిల్ లోని నీళ్ల‌ను ఒక మ‌నిషి తేలిక‌గా తాగేస్తాడు. అయితే ఆ వాట‌ర్ బాటిల్ మాత్రం తేలిక‌గా పోదు. రీ సైక్లింగ్ అయ్యే బాటిళ్ల శాతం చాలా త‌క్కువే. ఇక ప‌ర్యాట‌క ప్రాంతాల్లో అయితే ఈ వాట‌ర్ బాటిళ్లు పెను స‌మ‌స్య‌గా త‌యారు అవుతుంటాయి. ఈ క్ర‌మంలో అధ్యాత్మిక కేంద్రం తిరుమ‌ల‌లో టీటీడీ ఒక కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంది. అదే ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల నిషేధం.

ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ స్థానంలో గాజు బాటిళ్ల‌ను తీసుకు వ‌చ్చింది టీటీడీ. ఈ మేర‌కు ఒక సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుని, రేప‌టి నుంచి ప్లాస్టిక్ బాటిళ్ల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. ఈ గాజు బాటిల్స్ లో 750 మిల్లీ లీట‌ర్ల నీళ్లు ఉంటాయ‌ట‌. వీటి ధ‌ర ఇర‌వై రూపాయ‌లుగా నిర్ధారించారు. అయితే తాగి బాటిల్ ను వెన‌క్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌వేళ మొత్తం బాటిల్ కావాల‌నుకుంటే మ‌రో ఇర‌వై రూపాయ‌లు అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంద‌ట‌.
ఇలా ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాల‌ను అందుబాటులోకి తీసుకు రావాల‌ని టీటీడీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అలాగే గాజు సీసాల‌తో పాటు.. రాగి బాటిళ్ల‌ను, మ‌ట్టితో త‌యారు చేసిన బాటిల్స్ ను కూడా తిరుమ‌ల‌లో అందుబాటులోకి తీసుకురావాల‌ని టీటీడీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇలా తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్ కాలుష్యాన్ని పూర్తిగా క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. ఇప్ప‌టికే టీటీడీ ఇచ్చే ల‌డ్డు ప్ర‌సాదాల విష‌యం లో కూడా ప్లాస్టిక్ క‌వ‌ర్లు కాకుండా పేప‌ర్ బాక్స్ ల‌ను అమ‌లు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్టుగా ఉంది.
Tags:    

Similar News