రామోజీ వర్సెస్ జగన్ : మార్గదర్శి కేసులో కొత్త ట్విస్ట్

Update: 2023-03-22 08:17 GMT
ఏపీలో మార్గదర్శి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. ఇక మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో అవకతవకలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. చిట్ ఫండ్ కంపెనీలో ఖాతాదారుల సొమ్ముని వేరే సంస్థలలోకి బదలాయిస్తోందన్న కారణం మీదనే ఏపీ సీఐడీ అధికారులు కేసులను నమోదు చేశారు.

ఇక ఈ కేసులో మరింత దూకుడు ప్రదర్శిస్తామని, అవకతవకల విషయంలో కీలక ఆధారాలతో అవరరమైతే మార్గదర్శి మీద చర్యలకు దిగుతామని సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ నేపధ్యంలో తెలంగాణా హై కోర్టుకు మార్గదర్శి అధినేతలు వెళ్లారు. మార్గదర్శి అధినేతలు అయిన రామోజీరావు, శైలజా కిరణ్ ల మీద చర్యలు తీసుకోవద్దు అని తెలంగాణా హై కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక ఈ కేసులో నగదు బదిలీ అన్నది నేరం ఎలా అవుతుంది అని కోర్టు ప్రశ్నించడం విశేషం. నిధులు దారి మళ్ళింపు అన్నది అవకతవకలుగా, దుర్వినియోగంగా ఎలా భావిస్తారు అని కోర్టు పేర్కొందని అంటున్నారు. మ్యూచ్ ఫల్ ఫండ్లకు మార్గదర్శి నిధులను దారి మళ్ళిస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వం దాడులు చేసిన సంగతి విధితమే.

ఇంకో వైపు మార్గదర్శి ఖాతాదారులు ఎవరూ ఈ విషయంలో ఫిర్యాదు చేయలేదని అలంటి నేపధ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం ఎంతవరకు సబబు అన్నట్లుగా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అని అంటున్నారు. ఈ కేసు విషయంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా మార్గదర్శి కేసును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. మార్గదర్శి తరఫున ఆయన సమర్ధంగా వాదనలు వినిపించారు. తమ క్లయింట్లపై వేధింపుల్లో భాగంగానే ఈ సోదాలు జరిగాయని కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఏమి చేస్తుందో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా మార్గదర్శి కేసు విషయం ప్రస్తుతం సుప్రీం కోర్టులో కూడా విచారణ సాగుతోంది.

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏర్పాటు చేసి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకంగా సంస్థ యాజమాన్యం కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని సుప్రీం కోర్టులో కేసు పడింది. దీని విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి అవకతవకల మీద సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ఏపీ సర్కార్ కూడా ఇంప్లీడ్ అయింది. ఇపుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నగదు ని వేరే చోట్ల బదలాయించడం దుర్వినియోగం కాదు అంటూ తెలంగాణా కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో భారీ ఊరట రామోజీరావుకు లభించినట్లు అయింది.

దాంతో ఈ విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది చూడాలని అంటున్నారు. ఎందుకంటే ఈనాడు తెలుగుదేశం అనుకూల మీడియాగా వైసీపీ భావిస్తుంది, ఈనాడు సహా అనేక సంస్థలకు మూల ఆదాయం గా ఉన్న మార్గదర్శిని టచ్ చేయడం అందులో భాగమే అంటున్నారు. హై కోర్టు తీర్పుతో బిగ్ ట్విస్ట్ ఈ కేసులో చోటు చేసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News