నచ్చావయ్యా.. నర్సయ్యా!

Update: 2015-12-01 09:11 GMT
భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన టీఆరెస్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పార్లమెంటులో తరచూ మంచి అంశాలపై మాట్లాడుతుంటారు. ఆయన మాటల్లో విషయ పరిజ్ఞానం - విశ్లేషణ - మంచి భావజాలం కనిపిస్తుంటాయి. ఊరికే ఏదో మాట్లాడినట్లు కాకుండా అందులో అధ్యయనం కూడా కనిపిస్తుంటుందని చెబుతుంటారు. తాజాగా పార్లమెంటులో అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆకట్టుకునేలా మాట్లాడారు. ఆయన అభిప్రాయాన్ని చాలామంది మెచ్చుకున్నారు.ఏ

భారత దేశ డీఎన్ ఏలోనే అసహనం అనే పదానికి తావులేదని నర్సయ్య గౌడ్ మంగళవారం అన్నారు. అసహనం పైన లోక్ సభలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ భారత దేశ డీఎన్ ఏలోనే అసహనం లేదని... రాజకీయ లబ్ది కోసమే కొందరు అసహనాన్ని తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రజలను విడదీయొద్దని.. లేనిపోనివి సృష్టించి ప్రజలను భయపెట్టొద్దని సూచించారు. అసహనం అనేది రాజకీయ పార్టీల మధ్యే ఉంది కానీ ప్రజల మధ్య లేదని చెప్పారు.

కాగా దేశంలో మత ఘర్షణలు తగ్గాయని కేంద్ర మంత్రి రిజిజు పార్లమెంటులో చెప్పారు. గత ఏడాది దేశంలో కేవలం నాలుగు మత ఘర్షణ సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశవ్యాప్తంగా అలాంటి ఘటనలు తగ్గినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ సంఘటనలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ప్యానెల్ అవసరం లేదన్నారు. మరోవైపు గత ఏడాది సుమారు 650 ఘటనలు చోటుచేసుకున్నట్లు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపిస్తుండగా మంత్రి కేవలం అయిదు సంఘటనలే అని చెప్పడంతో ఏది నిజమన్న చర్చ మొదలైంది.  అసహనం పైన ప్రధాని నరేంద్ర మోడీ - ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా మాట్లాడనున్నారు.
Tags:    

Similar News