రికార్డ్ కోసం సోనియాను హ‌ర్ట్ చేస్తారా మోడీజీ

Update: 2017-08-07 07:05 GMT
రాజ్య‌స‌భ సీటు అంటే స‌హ‌జంగా పార్టీ పెద్ద‌ల‌కు ఇచ్చే గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానం. ఈ సీటు కోసం జ‌రిగే ఎన్నిక‌లో కూడా పోటీ ఉన్న‌ప్ప‌టికీ దానిపై అంత క్రేజ్ ఉండ‌దు. కానీ ఈ సారి సీన్  మారిపోయింది. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా రంగంలోకి దిగ‌డం, ఆయ‌న గెలుపుకోసం స్కెచ్ వేస్తోంది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కావ‌డం...వారిద్ద‌రూ ఓటమిని రుచి చూపించాల‌నుకునేది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడైన అహ్మద్‌ పటేల్‌ కు కావ‌డం...పైగా ఇవ‌న్నీ మోడీ సొంత ఇలాకా గుజ‌రాత్‌ లో అయిన నేప‌థ్యంలో  మంగళవారం జరగనున్న రాజ్యసభ ఎన్నికల పై అందరూ దృష్టి కేంద్రీకరించారు. ఇందులో ప్ర‌త్యేకత ఏమంటే.... ఒక ప్ర‌త్యేక రికార్డ్ సాధించేందుకు మోడీ-షా ద్వ‌యం వేసిన వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక కావ‌డం గ‌మ‌నార్హం.

ఐదోసారి రాజ్యసభ ఎన్నిక బరిలో దిగిన అహ్మ‌ద్ ప‌టేల్‌ ను అడ్డుకునేలా బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తోంది. అదే స‌మ‌యంలో అమిత్ షా గెలుపుకోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గుజరాత్‌ కాంగ్రెస్‌ లోని కొందరు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీ కండువాలను కప్పేసింది. అయితే అహ్మద్‌ పటేల్‌ ను ఓడిస్తే బీజేపీకి కలిగే ప్రయోజనమేంటి అనే సందేహానికి అనేక ఆస‌క్తిక‌ర‌మైన‌ స‌మాధానాలు వ‌స్తున్నాయి. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక..గుజరాత్‌ లో తొలి రాజ్యసభ ఎన్నిక ఇది. ఆ రాష్ట్రంలో బీసీ కోటా కోసం పటీదార్‌ ఆందోళన మెదలుకొని దళితుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా బీజేపీ బలహీనపడింది. ఈ నేప‌థ్యంలో ఈ రాజ్యసభ పోటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో అహ్మద్‌ పటేల్‌ ఓడితే.. కాంగ్రెస్‌కు మానసికంగా పెద్ద దెబ్బ తగులుతుందని అందుకే బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతోంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్‌ లో లుకలుకలు షురూ అయ్యాయి. పైగా కాంగ్రెస్‌ రెబల్‌గా బరిలో నిలిచిన రాజ్‌ పుత్‌ స్వయానా కాంగ్రెస్ రెబెల్ నేత‌ శంకర్‌ సింగ్‌ వాఘేలాకు బంధువు కావటంతో గుజరాత్‌ లో బెటర్‌ గా ఉండాల్సిన కాంగ్రెస్‌ పరిస్థితి రివర్స్‌ అయ్యింది. అహ్మద్‌ పటేల్‌ కనుక పరాజయం పాలైతే, కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా పోటీ ఇవ్వటం కష్టమవుతుందని, త‌ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానం ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌చ్చ‌ని బీజేపీ స్కెచ్ అని ప‌లువురు అంటున్నారు. గుజరాత్‌ అసెంబ్లీలో 193స్థానాలు ఉండగా - 150సీట్లు ఎలాగైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 1985లో మాధవ్‌ సింగ్ సోలంకీ నేతృత్వంలో కాంగ్రెస్‌ 149 సీట్లను గెలిచి రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఇప్పటికీ అలానే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా అధికారంలో రావ‌డంతో పాటు మరోసారి గద్దె ఎక్కాలని బీజేపీ అనుకుంటోంది. అయితే, జనంలో ఆదరణ సన్న గిల్లుతున్న తరుణంలో అపోజిషన్‌ ను అస్తవ్యస్తం చేసి లబ్దిపొందేలా బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో కుదిరితే రికార్డ్ విజ‌యం లేదంటే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు మోడీ-షా ధ్వ‌యం సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. కాగా, ఈ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం త‌న మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి కాంగ్రెస్‌ అధినాయకత్వం వారిని బెంగళూరుకు తరలించిన సంగ‌తి తెలిసిందే. ఈ రాజ్య‌సభ ఎన్నిక‌లు కాంగ్రెస్ పార్టీలోనూ ఉత్కంఠ‌కు కార‌ణం అవుతుండ‌టం గ‌మ‌నార్హం.!
Tags:    

Similar News