తొలిసారి మనదేశంలో కూడా ప్రత్యక్షమైన 'మిస్టీరియస్ మోనోలిత్' .. ఎక్కడంటే ?

Update: 2021-01-01 04:48 GMT
మిస్టరీ స్థంభం .. మిస్టరీ మోనోలిత్‌ .. గత కొన్నిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా రోజుకో ప్రదేశంలో ప్రత్యక్షం అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచంలో దాదాపుగా 30 నగరాల్లో కనిపించిన ఈ మిస్టరీ మోనోలిత్‌ మొట్టమొదటిసారిగా మనదేశంలో కూడా తాజాగా ప్రత్యక్షం అయింది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద 'మిస్టీరియస్‌ మోనోలిత్‌' ని చూసినట్లు ప్రజలు చెప్పారు. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే.

ఈ ఘటనపై పార్కు తోటమాలి ఆశారామ్ స్పందిస్తూ.. ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను క్రితం రోజు సాయంత్రం చూసినప్పుడు అసలు దాటి ఆనవాళ్లే లేవని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని తెలిపాడు.ఈ మిస్టరీ స్థంభం  గురించి ప్రచారం జరగడంతో అనేక మంది ప్రజలు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండటం ఆ పార్కు సందడిగా మారింది. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా ఉండి.. దాని ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయాలను కనుగొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

అమెరికాలోని ఉటా ఎడారిలో తొలుత ప్రత్యక్షమైనట్లు నివేదించబడింది. అనంతర కాలంలో రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియాలో కూడా ఇలాంటి 'మిస్టరీ ఏకశిల' నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఈ మిస్టీరియస్ మోనోలిత్ దానికదే అదృశ్యమవడం గమనార్హం. అహ్మదాబాద్‌లో ప్రత్యక్షమైన ఈ మిస్టరీ స్థంభం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News