ఢిల్లీ : లోక్‌ స‌భ హౌస్ కీపర్ కు కరోనా పాజిటివ్!

Update: 2020-04-22 09:10 GMT
క‌రోనా మహమ్మారి దేశవ్యాప్తంగా చాప‌కింద‌నీరులా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 20 వేలకి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ కు క‌రోనా వైరస్ సోకిందనే వార్తలు వినిపిస్తున్న తరుణంలోనే .. తాజాగా లోక్‌ స‌భ‌కు వైర‌స్ పాకిన‌ట్లుగా అధికారులు తెలిపారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...తాజాగా పార్ల‌మెంట్‌ లోని లోక్‌ స‌భ‌లో ప‌నిచేసే ఒక సీనియర్‌ హౌస్‌ కీపర్‌ కు పాజిటివ్‌ గా తేలింది. దీనితో మంగళవారం బాధితుడిని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చేర్పించినట్టు వెల్లడించారు. సెంట్రల్ ఢిల్లీలోని కలిబరి ప్రాంతంలో నివసిస్తున్న 58ఏళ్ల ఉద్యోగిని మంగళవారం ఉదయం 10.30నిమిషాలకు ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్పించినట్టు వివరించారు.

సోమవారం వెల్లడైన వైద్యపరీక్షా ఫలితాల్లో బాధితుడికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణౖందని లోక్‌ సభ సచివాలయ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీ బాల్యన్‌ మీడియాకు తెలిపారు. బాధిత ఉద్యోగి గత 35రోజుల నుంచి కార్యాలయంలో విధులకు హాజరుకాలేదని తెలిపారు. లాక్‌ డౌన్‌ విధించడానికి నాలుగురోజుల ముందే అతను రావడం మానేశాడని బాల్యన్‌ తెలిపారు. అలాగే కరోనా బాధితుడు ప‌ది రోజుల కింద‌ట అనారోగ్యానికి గురికాగా రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిలో చూపించుకున్నాడు. 

తాజాగా ఈనెల 18న క‌రోనా ల‌క్షణాలతో ఆస్ప‌త్రిలో చేర‌గా..  కరోనా నిర్దారణ ప‌రీక్షలు నిర్వహించగా ...పాజిటివ్‌ గా తేల‌డంతో వెంటనే అత‌డిని క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. అత‌నికి భార్య‌ - ముగ్గురు కొడుకులు - ఒక కూతురు ఉన్నారు. అలాగే మ‌న‌వ‌లు కూడా అతనితో క‌లిసి నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలో అధికారులు అందరికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  వారందరు కూడా ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నారని బాల్యన్ తెలిపారు.
Tags:    

Similar News