తెలంగాణ ప్రజా నాడి: ఆశించిన మార్పుపై పెదవి విరుపు!
తెలంగాణలో మార్పు కోరుకుంటూ.. 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బలమైన తీర్పు ఇచ్చారు.;
తెలంగాణలో మార్పు కోరుకుంటూ.. 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బలమైన తీర్పు ఇచ్చారు. వరుసగా పాలన సాగించిన బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. కాంగ్రెస్కు ఫస్ట్ టైమ్ అవకాశం కల్పించారు. అనేక ఆశలు.. అనేక మార్పులపై వారు ఎన్నో ఊహించుకున్నారు. బలమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని.. ప్రకటనలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై ఆశలు పెట్టుకుని సర్కారుకు ఓటెత్తారు.
మరి వారి ఆశలు ఫలించాయా? ఆశించిన మార్పు లభించిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారా? అం టే.. పాలకులకు ఒకింత బాధ కలిగినా.. క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. నిట్టూర్పులే వినిపిస్తున్నాయి. తమను తాము సరిచేసుకునే వారు.. నాయకులుగా ఎదుగుతారు.. నిలుస్తా రు. తమను తాము ధిక్కరించే వారు.. నాయకులుగా మిగిలిపోతారని అంటారు. ఇక, వారికి ఎలాంటి ఎదుగు బొదుగు ఉండదు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
తాజాగా కొన్ని చానెళ్లు నిర్వహించిన సర్వేలో మంత్రులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వెలుగు చూసింది. అదే సమయంలో రాష్ట్రంలో అధికారులు.. పోలీసుల పనితీరుపై తీవ్రస్థాయిలో ప్రజలు మండి పడుతు న్నారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అని అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ, వాస్తవాన్ని గుర్తించక పోతే.. మాత్రం `ఇందిరమ్మ రాజ్యం ఇక్కడితో సరి!` అనే మాట వినిపించడం పెద్ద దూరంలో ఉండదు. ప్రజలు కోరుకుంటున్న మార్పు అయితే.. కనిపించడం లేదనే మాట వినిపిస్తోంది.
ప్రజలు ఏమనుకుంటున్నారు?
+ ఆర్భాట ప్రకటనలకు పరిమితం అవుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోవడం లేదు.
+ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోందని.. అన్ని జిల్లాల్లోనూ వినిపిస్తున్న మాట.
+ రెవెన్యూ విభాగాలు డబ్బులు లేందే పనులు సాగేలా లేవని మెజారిటీ ప్రజలు చెబుతున్నారు.
+ హైదరాబాద్ను అభివృద్ధి చేయడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ.. నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ వంటి.. కీలక ప్రాంతాల మాటేంటని ప్రశ్నిస్తున్నారు.
+ రైతుల సమస్యలపై ప్రకటనలే తప్ప.. పట్టించుకునే వారు కరువయ్యారని ప్రశ్నిస్తున్నారు.
+ మంత్రుల దర్శనం లభించడం లేదని.. హైదరాబాద్ ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
+ ప్రజల మాట వినిపించుకునే వారు లేరని.. తమ మాటే వినాలన్న ధోరణి కొనసాగుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
+ సంక్షేమ పథకాలకు విధిస్తున్న ఆంక్షలు.. పెడుతున్న నిబంధనలతో లబ్ధిదారులయి ఉండి కూడా నష్టపోతున్నవారు చాలా మంది కనిపిస్తున్నారు.
+ కరెంటు కోతలతో పలు జిల్లాల ప్రజల్లో ఆవేదన నెలకొంది.
+ అనేక జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.
............... వెరసి ఇవన్నీ.. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలే. గతంలో బీఆర్ ఎస్ పాలన సాగినప్పుడు కూడా ప్రజలు ఇలాంటివి అనేకం చెప్పారు. నాడు.. ప్రతిపక్షాల కుట్ర అంటూ.. కేసీఆర్ వ్యాఖ్యానించారు. ``అవి కూడా ఛానెళ్లేనా?`` అంటూ.. ప్రజాప్రాయాన్ని కళ్లకు కట్టిన వారిని అవమానించారు. వెరసి.. ప్రజాగ్రహాన్ని పోగేసుకుని.. పెంచి పెద్దది చేసుకుని.. ఏమయ్యారో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వమైనా.. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోవాలి. వారి నాడిని పట్టుకునే ప్రయత్నం చేయాలి.