భారతీయులకు ఈ గల్ఫ్ దేశం షాక్.. 8లక్షలమంది వెనక్కి..

Update: 2020-07-06 16:30 GMT
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో అల్లకల్లోలమైంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి.

కరోనాతో ఉపాధి కోల్పోయిన తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించేందుకు విదేశీయులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రవాస ఉద్యోగులకు చెక్ పెట్టింది.

ఇప్పుడు గల్ఫ్ దేశం కువైట్ కూడా అదే బాటలో వెళ్తోంది. విదేశీ జనాభా చట్టం తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ చట్టం ద్వారా కువైట్ లో ఉండే విదేశీయుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తారు. అప్పటికే అక్కడ ఉన్న వారిని కూడా బలవంతంగా వెనక్కి పంపిస్తారు.

చమురుపైనే ఆధారపడి కువైట్ బతుకుతోంది. చమురు డిమాండ్ తగ్గి.. ధరలు భారీగా పడిపోయాయి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశీయులను నియంత్రించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రవాసీ కోటా బిల్లును తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.

కువైట్ జనాభా 48లక్షలు. విదేశీయులు 34 లక్షలు. అంటే కువైట్ లో 70శాతం విదేశీయులే. ఇందులో భారతీయుల సంఖ్య 14.5 లక్షలు. కరోనాతో ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ సబా అల్-ఖలీద్ అల్ సబా దేశ జనాభాలో 30శాతంమంది మాత్రమే విదేశీయులు ఉండేలా కొత్త చట్టం తేబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త బిల్లు ఆమోదం పొందితే.. 8 లక్షలమంది భారతీయులు కువైట్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో లక్షలాది మంది భారతీయులపై ప్రభావం పడనుంది.
Tags:    

Similar News