వెన్నుపోటులో ఔరంగ‌జేబు - బాబు ఒక్క‌టేన‌ట‌

Update: 2018-08-27 13:22 GMT
ఒకింత గ్యాప్‌ త‌ర్వాత‌...ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు గుప్పించిన కేటీఆర్‌..ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వెన్నుపోటు రాజ‌కీయంపై విరుచుకుప‌డ్డారు. మంత్రులు కేటీఆర్ - జగదీష్ రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు - కార్యకర్తలు టీఆర్ ఎస్ లో చేరారు. మంత్రులు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికారం కోసం పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర గల నేతలున్నార‌ని వ్యాఖ్యానించారు. ఔరంగజేబు నుంచి చంద్రబాబు దాకా వెన్నుపోటు రాజకీయాలే చేశార‌ని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే సీఎం కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి సారించారని ప్రధాని మోడీ పార్లమెంట్‌ లో చెప్పారని అది మ‌న ముఖ్య‌మంత్రి ఘ‌న‌త అని ఆయ‌న పేర్కొన్నారు.

దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కు పేరు రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్ మండిప‌డ్డారు. బాబు తీరును - కేసీఆర్ ప‌నివిధానాన్ని సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌వంసించార‌ని ఆయ‌న వివ‌రించారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే ఓడిస్తామని కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నరని, అది వారి ఊహ‌శ‌క్తికే వ‌దిలేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే..చెవి కోసుకుంటానని సీపీఐ నారాయణ అన్నారని, ఇది అలాంటిదేన‌న్నారు.  కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. `ప్రజలు గెలిపిస్తేనే నేను . శాసనసభ్యుడిని అయ్యాను. నేను 2006 నుంచి 2014 వరకు ఉద్యమంలో ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో నేను జైలుకు పోయాను. ఇది తెలియ‌ని వారే మాట్లాడుతున్నారు. బ్లాక్ మెయిల్ చేసి బతికే వాళ్లు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. డబ్బాల్లో - సంచుల్లో నోట్ల క‌ట్ట‌లు పెట్టడం కాంగ్రెస్ నేతలకే తెలుసు. ఎన్నికల్లో నోట్ల కట్టలతో ఎవరు దొరికారో ప్రజలకు తెలుసు` అని ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్ వేశారు.

కాంగ్రెస్ నేతలు బాత్ రూంకు వెళ్లాలన్నా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నమ్మలేదని, రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న హామీల‌కు విలువ ఉంటుందా అని ప్ర‌శ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే హామీలు నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వాలున్న పంజాబ్ - పుదుచ్చేరి - కర్ణాటకలో రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని సవాలు విసిరారు. కర్ణాటకలో నాలుగు దఫాలుగా ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను పిట్టల్లా కాల్చిన చరిత్ర రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీదన్నారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన చరిత్ర సోనియాగాంధీదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధిస్తమని 2001లోనే కేసీఆర్ చెప్పార‌ని..చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించార‌ని తెలిపారు. పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసిన ఘనత టీఆర్ ఎస్ పార్టీదని కేటీఆర్ అన్నారు. వ‌చ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 సీట్లు గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా టీఆర్ ఎస్‌ కే పట్టంగట్టారని కేటీఆర్ పేర్కొన్నారు.
Tags:    

Similar News