అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

Update: 2021-12-28 11:30 GMT
హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరింది. మరో కొత్త ఫ్లైఓవర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని కంచన్ బాగ్ లోని ఫిసల్ బండ డీఆర్డీఎల్ వైపు నుంచి ఓవైసీ ఆస్పత్రి కూడలి మీదుగా బైరామల్ గూడ వైపు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.

ఓవైసీ-మిధాని కూడళ్లలో జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3 కి.మీల మేర ఫ్లై ఓవర్ ను నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి , పాతబస్తీకి వారధిగా పైవంతెన నిలవనుంది. ముఖ్యంగా పాతబస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.

మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్ నగర్ , సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.

ఈ పై వంతెన ద్వారా చాంద్రాయణగుట్ట, కర్మాన్ ఘాట్ మార్గాల ద్వారా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.


Tags:    

Similar News