ఆపిల్ ముచ్చ‌ట‌ను మ‌రోసారి చెప్పిన కేటీఆర్

Update: 2017-06-01 11:53 GMT
విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ముగించుకొని రాష్ట్రానికి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాంచి ఉత్సాహంగా ఉన్నారు. త‌న విదేశీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న దృష్టికి వ‌చ్చిన సానుకూలాంశాల‌తో ఆయ‌న కొత్త కొత్త విష‌యాల్ని చెబుతున్నారు. తాజాగా టీ వ్యాలెట్ ఆవిష్క‌రించిన కేటీఆర్‌.. జాతీయ వృద్ధిరేటు కంటే తెలంగాణ ఐటీ వృద్ధిరేటు ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు.

టి-బ్రిడ్జ్ కార్య‌క్ర‌మంతో ప‌లు అమెరికా స్టార్ట‌ప్ ల‌ను భార‌త్‌ కు తీసుకొచ్చేందుకు తాము కృషి చేయ‌నున్న‌ట్లు చెప్పిన కేటీఆర్‌.. ఆపిల్ సంస్థ‌కు చెందిన అతి పెద్ద క్యాంప‌స్ హైద‌రాబాద్‌ కు రానున్న విష‌యాన్ని చెప్పారు. ఆపిల్ వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గ‌తంలోనూ ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. ఈసారి మాత్రం ఆత్మ‌విశ్వాసంతో చెప్ప‌టం క‌నిపించింది.

రావిలాల స‌మీపంలో మూడు వేలకు పైగా ఎక‌రాల్లో ఈ-సిటీ ఏర్పాటు చేయ‌నున్నట్లుగా వెల్ల‌డించారు. ప‌లు స్టార్ట్ ప్ లు తీసుకురావ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా చెప్పారు. తెలంగాణ‌ను ఎల‌క్ట్రానిక్ హ‌బ్ గా చేయ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఈ-లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముందు ఉంద‌న్న ఆయ‌న‌.. తాజా టీ వ్యాలెట్ ద్వారా అన్ని ర‌కాల ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల చెల్లింపులు చేయ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అమ‌లు చేస్తున్న మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసేందుకు 11 రాష్ట్రాలు అధ్య‌నం చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అన్ని శాఖ‌ల‌కు మొబైల్ ఫోన్ల‌ను అందిచ‌నున్న‌ట్లు చెప్పిన కేటీఆర్‌.. ఈ- గ‌వ‌ర్న‌న్సెను ఎం-గ‌వ‌ర్న‌న్సె స్థాయికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రి.. కేటీఆర్ నోటి వెంట వ‌చ్చిన ఆపిల్ క‌ల ఎప్ప‌టికి వాస్త‌వ రూపం దాలుస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News