టీడీపీలో ఆ మాజీ మంత్రి అడ్ర‌స్ ఎక్క‌డ ?

Update: 2021-08-03 04:48 GMT
ఆయ‌న మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. కాలం క‌లిసిరాక‌.. ఓడిపోయారు. మ‌రి ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారా ?  లేక‌.. అస‌లు రాజ‌కీయాల‌కు దూరంగా జ‌రిగారా ? ఇదీ.. ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లోనూ.. పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లోనూ ప్ర‌బ‌లంగా తెర‌మీదికి వ‌చ్చిన చ‌ర్చ‌. విష‌యంలోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీ మోహ‌న్ ఐపు లేకుండా పోయారు.

వాస్త‌వానికి ఆయ‌న జిల్లాలో ఒక‌ప్పుడు ఫైర్ బ్రాండ్ నాయ‌కుడుగా చ‌లామ‌ణి అయ్యారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున రాజాం నుంచివిజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌కు.. కేబినెట్‌లో బెర్త్ ద‌క్కింది. అప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించే మ‌రో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుతోనే ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రించారు.

అదే స‌మ‌యంలో కొన్నేళ్ల‌కు పార్టీ పెట్టిన‌.. వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డంలో కాంగ్రెస్ ముర‌ళిని బాగానే వినియోగించుకుంది. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆయ‌న 2014లో ముర‌ళి పూర్తిగా డ‌ల్ అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు కేవ‌లం 4950 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చి ఆఖ‌రుకు డిపాజిట్‌ను కూడా వ‌దులుకున్నారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లోనూ ఆయ‌న పుంజుకోలేక పోయారు. 2019 ఎఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన కార‌ణంగా.. ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకునేది లేద‌ని.. కొంద‌రు నాయ‌కులు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు.

2019 ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నాయ‌కురాలు.. కావ‌లి ప్ర‌తిభాభార‌తి.. ఈ టికెట్‌ను త‌న కుమార్తె గ్రీష్మ‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరినా.. ఆయ‌న ప‌ట్టించుకోకుండా.. ముర‌ళికి కేటాయించారు. వైసీపీ సునామీలో ముర‌ళి మ‌ళ్లీ ఓడిపోయారు. ఎన్నిక‌లు పూర్త‌య్యి రెండేళ్లు అవుతున్నా ఆయ‌న ఓట‌మి ప‌రాభవం నుంచి కోలుకోని ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేదు. మ‌ధ్య‌లో ఆయ‌న బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. పోనీ టీడీపీలో అయినా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా ? అంటే.. అది కూడా లేదు. ముర‌ళి ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌నే వాద‌న జిల్లా టీడీపీలో జోరుగా వినిపిస్తోంది.

చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌నేవాద‌న ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏ గ్రీష్మ‌ను అయితే బాబు ప‌క్క‌న పెట్టారో ఇప్పుడు మ‌ళ్లీ ఆమెనే తెర‌మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నాల‌ను పార్టీలో లోకేష్ వ‌ర్గం చేస్తోంద‌ట‌. అదే జ‌రిగితే ముర‌ళీ ప‌రిస్థితి రెండిటికి చెడ్డ రేవ‌డిగానే మిగిలిపోనుంది.
Tags:    

Similar News