నేనే ఆ బాహుబలి అంటున్న ఆ లీడర్

Update: 2017-03-19 04:30 GMT
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి.. ఆ పార్టీని 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి తీసుకురావడానికి ఒక ‘బాహుబలి’ వస్తాడంటూ సీనియర్ నేత జానా రెడ్డి రెండు రోజుల కిందట ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జానా రెడ్డి చెబుతున్న ‘బాహుబలి’ తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరున్నారబ్బా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటే.. ఆ బాహుబలి తానేనంటూ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జానా రెడ్డి వ్యాఖ్యలపై మిగతా కాంగ్రెస్ నేతలంతా సైలెంటుగా ఉండగా.. కోమటిరెడ్డి మాత్రం ఉత్సాహంగా స్పందించడమే దీనికి సూచిక.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని ఆశపడుతున్న కోమటి రెడ్డి జానా రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘‘అవును. మా పార్టీని గెలిపించడానికి బాహుబలి వస్తాడు. అది జానా రెడ్డి కావచ్చు.. లేదా మరో లీడర్ కావచ్చు’’ అంటూ ఆ మరో లీడర్ తానే అనే సంకేతాలిచ్చాడు కోమటిరెడ్డి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో జనబలం ఉండి.. కాస్త దూకుడుగా వ్యవహరించే నేతల్లో ముందు కోమటిరెడ్డి పేరే చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనలోనే ‘బాహుబలి’ని చూసుకుంటే ఆశ్చర్యం లేకపోవచ్చు. అధికార పార్టీకి వ్యతిరేకంగా అంతో ఇంతో గొంతు విప్పుతున్నది కోమటిరెడ్డే. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు కోమటిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు అసలేమీ చింత లేదని.. ఆయన నల్గొండతో పాటు మహబూబ్ నగర్.. ఖమ్మం జిల్లాలకు నాగార్జున సాగర్ నీళ్లివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News