సాగర తీరాన్నుంచి ఏపీ పాలనకు సర్వం సిద్ధం

Update: 2020-03-15 03:30 GMT
మూడు రాజధానులను ప్రకటించి, అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు తెరతీసిన వైఎస్‌ జగన్ ఆ తర్వాత కాస్త నెమ్మదించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు సహా అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, హైకోర్టులో కేసులు, కేంద్ర ఆరాల నేపథ్యంలో దూకుడు కాస్త తగ్గించారు. అయితే, నిర్ణయం నుంచి పూర్తిగా వెనక్కు తగ్గలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకడుగు వెనక్కు వేసినా.... గతం కంటే బలంగా, వేగంగా నాలుగడుగు ముందుకు దూకాలన్న టైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. అందుకే సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయం తీసుకునే నాటికి విద్యాసంవత్సరం సగంలో ఉండటం, ప్రస్తుతం పదో తరగతి పరీక్షల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికల వంటి కారణాలు కూడా జగన్‌ ను కాస్త నెమ్మదించేలా చేశాయి. స్థానిక ఎన్నికలు పూర్తయి, పదో తరగతి పరీక్షలు కూడా అయి పోయాక తన నిర్ణయాన్ని అమలు చేయాలన్న పట్టుదల లో జగన్ ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయం పై కేంద్రం అనుమతి ఇచ్చేవరకు వరకు కూడా జగన్ వెయిట్ చేయాలనుకోవడం లేదని సమాచారం.

పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో కొన్ని రోజుల్లోనే పరిపాలన ప్రారంభించాలని సీఎం ప్లాన్‌ చేస్తున్నారు. ముహూర్తం కూడా ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఏప్రిల్ మొదటివారం నుంచి సాగర తీర నగరం కేంద్రంగా విధులు ఆరంభించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ మొదటివారం ఎందుకంటే, దానికీ కొన్ని కారణాలున్నాయి. మార్చి 28వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈసారికి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. 4 రోజుల్లోనే సమావేశాలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలాఖరుకు ఎన్నికల హడావుడంతా ముగుస్తుంది. ఎన్నికల కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి మొదలై ఏప్రిల్ 17వ తేదీ వరకు జరుగుతాయి.

విద్యాసంవత్సరం అక్కడితో ముగుస్తుంది. విశాఖకు తరలి వెళ్లడానికి ఉద్యోగుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కావు. వీటితో పాటుగా అమరావతి నుంచి విశాఖపట్నం తరలి వెళ్లడానికి కొన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాల్సి ఉంది. విశాఖలో కార్యాలయాలు వెదకడం, అమరావతి నుంచి ఫర్నీచర్‌, ఫైళ్లు తరలించడం వంటివి ఉన్నాయి. వీటిని కూడా కొన్ని రోజుల్లోనే ముగించేస్తారు. గతంలో రాష్ట్ర విభజన తర్వాత, హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపు వ్యూహాన్నే ఇప్పుడు కూడా అనుసరించబోతున్నారు. ముందుగా, ముఖ్యమైన పాలన విభాగాలను, అధికారులను విశాఖకు తీసుకువెళ్లనున్నారు. మిగిలిన విభాగాల్లోని ఉద్యోగులను వీలును బట్టి తరలించనున్నారు.

వైఎస్ జగన్ సతీమణి భారతి ఇప్పటికే విశాఖలో రెండు, మూడుసార్లు పర్యటించారు. సీఎం నివాసం కోసం కొన్ని భవనాలను పరిశీలించారు. నేవీ గెస్ట్‌హౌస్‌ కూడా ఆమె పరిశీలించిన భవనాల్లో ఒకటి. నేవీ గెస్ట్‌ హౌస్‌ వైపు భారతి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అమరావతే శాసన రాజధాని కాబట్టి, అసెంబ్లీ, మండలి అక్కడే ఉంటాయి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు సమావేశాలను విశాఖలోనూ నిర్వహిస్తారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన సీఎం, అక్కడికి కూడా కొన్ని కార్యాలయాల తరలింపు ఆలోచనలో ఉన్నారు. ఇంటెలిజెన్స్‌ కార్యాలయాన్ని కర్నూలు తరలించాలని ఆదేశాలు జారీ చేసినా, హైకోర్టు లో కేసు కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడింది. ఏది ఏమైనా, ముందుగా విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తే పరిస్థితులన్నీ సర్దుకుంటాయని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News