కేసీఆర్‌‌ తో కయ్యానికి కాలు దువ్వుతున్న కత్తి

Update: 2018-01-17 12:37 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిత్యం కత్తులు నూరుతూ వార్తల్లో నానుతున్న కత్తి మహేశ్ ఇప్పుడు తన పరిధిని విస్తరిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు - బాలకృష్ణపైన విమర్శలు చేసిన ఆయన తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పైనా విమర్శలు చేశారు. అంతేకాదు... దళిత నేతగా గుజరాత్ నుంచి జాతీయ స్థాయికి  చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కృత్రిమ హస్తం గుజరాత్ ఎమ్మెల్యే  జిగ్నేశ్ మేవానీని కూడా కలిశారు.
    
జిగ్నేశ్ మేవానీ ఈ రోజు చంచల్ గూడ జైల్లో ఉన్న మంద కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా కత్తి మహేశ్ కూడా మందకృష్ణను కలవడంతో పాటు జిగ్నేశ్ మేవానీని కూడా కలిశారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని - కేసీఆర్‌ పై తిరుగుబాటు తప్పదని కత్తి మహేష్‌ వ్యాఖ్యానించారు.
    
ఎమ్మార్పీఎస్‌ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కత్తి మహేష్‌ స్పష్టం చేశారు. అలాగే జిగ్నేశ్ కు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. జిగ్నేష్‌ ను ఆదర్శంగా తీసుకుని దళిత సామాజిక వర్గానికి చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని గతంలో కూడా కత్తి మహేశ్ చెప్పారు. ఇంతవరకు పవన్ ఒక్కడినే టార్గెట్ చేసినా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల దళిత వర్గాలతో కలిసి రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారన్న అంచనాలు వెలువడుతున్నాయి.
Tags:    

Similar News