కర్నాటకలో ఉపఎన్నిక వాయిదా.. ఎందుకంటే?

Update: 2019-09-26 15:39 GMT
దేశ వ్యాప్తంగా రెండు రాష్ట్రాల (హర్యానా.. మహారాష్ట్ర) అసెంబ్లీలకు.. ఖాళీగా ఉన్న ఎంపీ.. ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల్ని నిర్వహిస్తూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. తాను జారీ చేసిన నోటిఫికేషన్ కు మార్పులు చేసింది సీఈసీ. కర్ణాటక రాష్ట్రంలో జరగాల్సిన 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్ని వాయిదా వేస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.

రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పులు వెల్లడించని నేపథ్యంలో.. ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఉప ఎన్నికలను వాయిదా వేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిన్ ఎన్వీ రమణ ధర్మాసనానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని అందించింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై వచ్చే నెల (అక్టోబరు) 22న తదుపరి విచారణను సుప్రీం చేపట్టనుంది.

పదిహేను మంది కర్ణాటక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంలోకి వెళితే.. కాంగ్రెస్ -జేడీఎస్ సర్కారుకు కారణమైన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ ఆ మధ్యన అనర్హత వేటు వేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సుప్రీంతలుపు తట్టారు. దీనిపై ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడని నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను వాయిదా వేయాలని తాజాగా నిర్ణయించింది.   దీంతో.. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు కొత్త ఉత్కంటకు తెర తీసిందని చెప్పాలి.


Tags:    

Similar News