మనోడ్ని చంపినోడు ఎలాంటోడంటే..

Update: 2017-02-27 05:58 GMT
తలకెక్కిన జాత్యాంహంకారంతో తెలుగోడ్ని హత్య చేసిన ఆడమ్ ప్యూరింటన్ ఎలాంటోడన్న విషయంపై మరింత స్పష్టత వచ్చింది. అతడికి సంబంధించిన విషయాల్ని అతడికి ఇరుగుపొరుగుగా ఉన్న వారు చెబుతున్నారు. స్నేహపూర్వకంగా ఉంటూ.. తన పని తాను చేసుకుపోయే శ్రీనివాస్ కూఛిబొట్లకు పూర్తి భిన్నంగా ఫ్యూరింటన్ తీరు ఉంటుందని చెబుతున్నారు. అతడో పచ్చి తాగుబోతుగా పేర్కొంటున్నారు.

చాలా కాలం నుంచే విపరీతంగా తాగేవాడని.. పద్దెనిమిది నెలల క్రితం తండ్రి మరణించిన నాటి నుంచి ఈ తాగుడు వ్యసనం మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు. నేవీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పని చేసిన ఫ్యూరింటన్..ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కుదురుగా ఉద్యోగం చేయలేదన్న విషయాన్ని చెబుతున్నారు.

తరచూ ఉద్యోగాల్ని మారుస్తూ.. స్థిమితం లేని జీవితాన్ని గడిపేవాడని.. తెల్లవారుజాము నుంచే తాగటం అతడికో అలవాటుగా చెబుతున్నారు. పక్షులను వేటాడే గన్ అతడి తండ్రి వద్ద ఉండేదని.. ఆయన మరణించిన తర్వాత.. ఆ గన్ ను అతడి చేతికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొడుకు గురించి అతడి తల్లి మార్షా ప్యూరింటన్ మాట్లాడుతూ.. తమతో అతడు సంబంధాలు తెంచుకున్నాడని.. కాకుంటే.. ఎప్పుడూ వర్ణ వివక్ష గురించి మాట్లాడిన వైనాన్ని తాము ఎప్పుడూ వినలేదని చెబుతున్నారు.

ఇక.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. ట్రంప్ నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీలో తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. నేవీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత.. తొలుత ఐటీ కంపెనీలోనూ.. తర్వాత హార్డ్ వేర్ షాపులోనూ పని చేసిన ఆడమ్.. కొద్దికాలం పాటు పిజ్జా పార్లర్ లో ప్లేట్లు కడిగేవాడని చెబుతున్నారు. ఫ్యూరింటన్ ఉదంతాన్ని వింటే.. పిచ్చోడి చేతికి రాయి దొరికితే ఎలా ఉంటుంది.. ప్యూరింటన్ లాంటోడి చేతికి గన్ దొరికితే అలా ఉంటుందన్న విషయం అతగాడి గురించి తెలిస్తే అర్థమవుతుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News