జగన్ గూట్లోకి కన్నా వచ్చేస్తున్నాడు

Update: 2017-02-22 16:08 GMT
వివిధ కారణాలతో జగన్ పార్టీలోకి చేరలేకపోయిన సీనియర్ నేతలంతా ఇప్పుడు తమ దృష్టిని జగన్ వైపు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సాగి.. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు.. విభజన నేపథ్యంలో వివిధ పార్టీల్లోకి చేరిపోయిన వారున్నారు. అలాంటి వారిలో గుంటూరుకు చెందిన సీనియర్ నేత.. కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ప్రజల్లో పలుకుబడి ఉన్నప్పటికీ.. విభజన శాపం కాంగ్రెస్ పుణ్యమా అని ఆయనకు తగలక తప్పలేదు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేని నేపథ్యంలో.. బీజేపీలోకి చేరాల్సి వచ్చింది. కాంగ్రెస్ వాదిగా పేరు మోసిన కన్నాకు కమలనాథుడిగా ఏ మాత్రం ఫిట్ కాలేకపోతున్నారు. మోడీ కారణంగా ఏపీలో బీజేపీ చెలరేగిపోతుందని.. అధికార తెలుగుదేశానికి మించిన వేగంతో విస్తరిస్తుందన్న అంచనాలు నిజం కాకపోవటం.. బీజేపీ అగ్రనేతలకు అలాంటి ఆలోచన లేని నేపథ్యంలో.. బీజేపీలో ఉంటే ఎప్పటికి ఎదగలేమన్న నిర్ణయానికి కన్నా వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో టీడీపీకి తోక పార్టీగా ఉండటం మినహా.. తనకు తానుగా స్వతంత్రంగా ఎదిగే ఆలోచనలు చేయని నేపథ్యంలో.. బీజేపీలో కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు జగన్ పార్టీ మీద పడింది. 2019 ఎన్నికల్లో గుంటూరు 2 నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న ఆయన.. తనకు సరిగ్గా సరిపోయే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో జగన్ పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్న ఆయన.. ఆ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే ప్రయత్నాలు చేస్తున్న కన్నాకు.. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మరికొద్ది రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం ఖాయమన్నమాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News