బాబు మీద తట్టెడు ప్రేమ కురిపించిన జేసీ

Update: 2015-05-23 10:00 GMT
తన మాటలతో వేడి పుట్టించే రాజకీయనాయకుల్లో రాయలసీమకు చెందిన జేసీ దివాకర్‌రెడ్డి ఒకరు. మనసుకు అనిపించే వ్యాఖ్యను ఎలాంటి మొహామాటం లేకుండా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడతారే తప్పించి.. పార్టీ అధినేత ఏమంటారో? అంటూ ఆచితూచి మాట్లాడే తత్వం జేసీ ఇంటావంటా లేదు.

గత కొద్దికాలంగా కామ్‌గా ఉన్న ఆయన.. తాజాగా ఆనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న మినీ మహానాడులో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి షిఫ్ట్‌ అయి తెలుగుదేశం పార్టీలో చేరిన జేసీ దివాకర్‌ రెడ్డి.. బాబు మీద తనకున్న ప్రేమను భారీగా కురిపించేశారు.

చంద్రబాబు దూరదృష్టి వల్లనే రాయలసీమకు నీళ్లు అందుతున్నాయని పొగిడిన జేసీ.. బాబు నాయకత్వంలో ఆనంతపురం జిల్లా సస్యశామలం అవుతుందని చెప్పారు. బాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలు మద్ధతు ఇవ్వాలని.. ఆయనకు అండగా నిలవాలని కోరారు. అనంతపురం జిల్లా అంటే చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని.. ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాబు మీద ఈ స్థాయిలో జేసీ ప్రేమ కురిపిస్తున్నారు సరే.. ఇదెంత కాలం ఉంటుందో చూడాలి మరి.


Tags:    

Similar News