'దెందులూరు' వివాదం.. చంద్రబాబు ఆరా!
ఇక, ఇరువురు పార్టీ నాయకులే కావడంతో ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది. దీంతో కీలక నాయకులు జోక్యం చేసుకుని.. ఈడ్పుగంటిని హెచ్చరించారు.
ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్.. ఈడ్పుగంటి శ్రీనివాసరావు మధ్య చెలరేగిన వివాదం.. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే చింతమనేని వైఖరిని నిరసిస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. ఈ పరిణామాలపై ఇప్పటికే టీడీపీ దృష్టి పెట్టింది. అయినా.. సమస్య పరిష్కారం అవుతున్నట్టు కనిపించకపోవడంతో సీఎం చంద్రబాబు ఆరా తీశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏం జరిగింది?
చింతమనేని ప్రభాకర్పై.. టీడీపీ లీగల్ సెల్కే చెందిన ఈడ్పుగంటి శ్రీనివాసరావు.. ఆరోపణలు చేశారు. ఇసుక, మద్యం, మట్టి ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం.. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా చేసింది. దీంతో చింతమనేని గత రాత్రి.. ఈడ్పుగంటి నివాసం వద్దకు వెళ్లి.. చర్చకు రావాలని పట్టుబట్టారు. వైసీపీ తో కుమ్మక్కయి.. తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్షణమే ఏదో ఒకటి తేలిపోవాలని పట్టుబట్టారు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని చింతమనేనికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు.
పార్టీ చర్యలు..
ఇక, ఇరువురు పార్టీ నాయకులే కావడంతో ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది. దీంతో కీలక నాయకులు జోక్యం చేసుకుని.. ఈడ్పుగంటిని హెచ్చరించారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే.. మై టీడీపీ యాప్ ద్వారా పెద్దల దృష్టికి తీసుకురావాలని పదే పదే చెప్పామని.. అయినా.. వినకుండా బహిరంగ వేదికలపై మాట్లాడడం సరికాదని పేర్కొంటూ.. ఈడ్పుగంటికి తొలుత షోకాజ్ ఇచ్చారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అనంతరం.. ఈ వ్యవహారం మరింత రచ్చకు దారితీసింది. తనదూకుడు ఆపబోనని ఈడ్పుగంటి తేల్చి చెప్పారు. దీనికి ప్రతిగా చింతమనేని కూడా స్పందించారు. మొత్తంగా ఇరువురి మధ్య వివాదం పార్టీకి తలనొప్పిగా మారడంతో ఈడ్పుగంటి వర్సెస్ చింతమనేని ప్రభాకర్ విషయాన్ని తాను చూస్తానని.. ఇరువురినీ ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీకి చేరుకోగానే ఈ విషయంపై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొన్నాయి.