నీర‌వ్‌ కంటే మోస‌గాడు ఈ గుజరాతీ వ్యాపారి

Update: 2018-02-21 05:44 GMT
బ్యాంకుల్లో వ‌జ్రాల దొంగ‌లు ప‌డ్డారు! వజ్రాల వ్యాపారుల తీరుతో సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. తమ లగ్జరీ వ్యాపారాలను అడ్డుపెట్టుకుని బ్యాంకులను నిలువుదోపిడి చేసేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)కు రూ.11,400 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన నేటి మామా-అల్లుళ్లు మెహుల్ చోక్సీ - నీరవ్ మోడీల దగ్గర్నుంచి నాటి జతిన్ మెహతా రూ.7,000 కోట్ల ఎగవేతల వరకు అంతా కూడా భారతీయ బ్యాంకులను బాగా ముంచిన వజ్రాల వర్తకులే. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోని మన బ్యాంకర్లు.. వీరికి వేల కోట్లను దోచిపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చినదే నీరవ్ మోడీ తాజా కుంభకోణం. అయితే వజ్రాల వ్యాపారుల మోసాలకు మాత్రం ఆధునిక పితామహుడిగా జతిన్ మెహతాను పేర్కొనవచ్చు.

విన్సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీ లిమిటెడ్ చైర్మనే జతిన్ మెహతా. స్టాక్ మార్కెట్‌ లో లిస్టైన ఈ కంపెనీకి సురాజ్ డైమండ్స్ అనే మరో పేరు కూడా ఉంది. దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని వాటిని ఎగవేసి పరాయి దేశాలకు పారిపోయిన ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల్లో జతిన్ మెహతాది ప్రస్తుతం మూడో స్థానం. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రికార్డుల ప్రకారం నీరవ్ మోడీ - లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా తర్వాత ఉన్నది మెహతానే. 2011లో విన్సమ్ రుణాల ప్రక్రియ మొదలవగా - మొత్తం 15 బ్యాంకుల నుంచి రూ.6,800 కోట్లు మెహతా తీసుకున్నాడు. వీటిని ఎగ్గొట్టేందుకు పక్కా ప్రణాళికనూ రూపొందించుకున్న మెహతా.. ఆగస్టు 13 - 2012న దానికి శ్రీకారం చుట్టాడు. తొలుత తమ గ్రూప్‌ లోని ఫరెవర్ ప్రీషియస్ డైమండ్ అండ్ జువెల్లరీ నుంచి వైదొలిగాడు. ఇదే ఏడాది నవంబర్ 9న విన్సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీకీ గుడ్‌ బై చెప్పాడు. 2013 మధ్యమం నుంచి రుణాల ఎగవేతకు పాల్పడిన మెహతా.. చివరకు యూఏఈ జువెల్లర్స్‌ కు డెరివేటివ్ నష్టాలు వచ్చాయని - దాన్నుంచి తమకు రావాల్సిన చెల్లింపులు రాలేకపోతున్నందున.. మాకు అప్పులిచ్చిన బ్యాంకులకు మేమూ చెల్లించలేకపోతున్నామని ప్రకటించాడు.
అనంత‌రం విదేశాలకు పారిపోయాడు. దీంతో ఇదే ఏడాది అక్టోబర్‌ లో మెహతాను బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి.

ఈ కేసులో సీబీఐ ఏళ్ల‌ తరబడి విచారణ చేసినా ఫలితం మాత్రం శూన్యం. కారణం మెహతా ప్రస్తుతం సెయింట్ కిట్స్ పౌరుడు. డైమండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (యూకే) లిమిటెడ్ పేరుతో అక్కడ వ్యాపారం కూడా చేస్తున్నాడు! భారత్‌ లో మాత్రం ఈ గుజరాత్‌ కు చెందిన వజ్రాల వ్యాపారి అప్పగింతకు దర్యాప్తు సంస్థలు పడిగాపులు కాస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి దగ్గరి బంధువు కావడం గ‌మ‌నార్హం. ప్రధాని నరేంద్ర మోడీకి అదానీకి సన్నిహిత సంబంధాలుండటం కేసును నిరుగార్చిందన్న విమర్శలున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎన్‌ పీఏలపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. రియల్ ఎస్టేట్ - డైమండ్ రంగాల్లోని కీలక వ్యక్తులు ఈ మొండి బకాయిల వెనుక ఉన్నారని ఎప్పుడో గుర్తించారు. ఈ విషయంపై దృష్టి సారించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయాని (పీఎంవో)కి లేఖ కూడా రాశారు. పలు కేసుల్లో విచారణలకు ఎదురవుతున్న అడ్డంకులనూ అందులో వివరించారు. అంతేగాక విదేశాలకు బ్యాంకుల సొమ్ము దొంగచాటుగా తరలిపోతున్నదని - ఆయా దర్యాప్తు సంస్థలతో బ్యాంకర్లు కలిసి పనిచేయాలని కూడా సూచించారు. అయితే రాజన్ హెచ్చరికలను అటు ప్రభుత్వంగానీ - ఇటు బ్యాంకులుగానీ సీరియస్‌ గా తీసుకోలేదన్న నిజాన్ని తాజా నీరవ్ - కొఠారి కుంభకోణాలు రుజువు చేస్తున్నాయి.

Tags:    

Similar News