ఏపీ రాజధానిపై డిసెంబర్ లో జగన్ కీలక ప్రకటన?

Update: 2019-11-20 07:57 GMT
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పనులు ఆగిపోయాయి. హైకోర్టు, ఇతర సంస్థలను రాయలసీమకు తరలించాలన్న డిమాండ్ ఊపందుకుంది. రాజధానిని దోమకొండకు తరలిస్తారన్న ప్రచారం సాగింది. ప్రతిపక్ష టీడీపీ దీన్ని ప్రచార అస్త్రంగా మలిచి ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసింది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు. ఏపీకి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.?  ఈ గందరగోళానికి తెరదించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. వైసీపీ సర్కారు ఇప్పటికే జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.

తాజాగా జగన్ సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమగ్ర నివేదికను రూపొందించినట్టు తెలిసింది. వీరు సీఎం జగన్ కు ఈ నివేదికను అందించడానికి రెడీ అయ్యారట..

నిపుణుల కమిటీ సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని - అసెంబ్లీ ప్రాంగణాన్ని మంగళగిరికి తరలించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజాభిప్రాయంలో ఏపీ రాజధానిని ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అనుకూలమని అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఇక హైకోర్టును అధికార వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు తరలిస్తేనే బెటర్ అని నిపుణుల కమిటీ నివేదిస్తున్నట్టు తెలిసింది. ఈ నిపుణుల కమిటీ నివేదికను అనుసరించి జగన్ సర్కారు ఏపీకి కీలకమైన రాజధాని - హైకోర్టు - ఇతర సంస్థల ఏర్పాటుపై డిసెంబర్ లో కీలక ప్రకటనకు రెడీ అయినట్లు సమాచారం.
Tags:    

Similar News