అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో ఎల్‌అండ్‌టీ వాటా.. రీజన్ ఇదే !

Update: 2021-09-01 13:30 GMT
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు లో ఎల్‌ అండ్‌ టీ వాటాను ఆ సంస్థ విక్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ మంగళవారం ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఉత్తరాఖండ్‌ లో ఎల్‌ అండ్‌ టీకి చెందిన 99 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి విక్రయించిన విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రకటనలో సేన్‌ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌ అండ్‌ టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది.

ఈ మేరకు విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ మెట్రోతో పాటు ఇతర ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మెట్రోను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే మరోవైపు రుణాల కోసం సంస్థ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో పూర్తి వాటాను విక్రయిస్తారా, లేక కొంత వాటానా అన్నది మాత్రం సేన్‌ వెల్లడించలేదు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతోపాటు పంజాబ్‌ లోని నభా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు తమ సంస్థ ఆధ్వర్యంలోని ఇతర ఆస్తులను కూడా విక్రయించాలని చూస్తున్నట్లు తెలిపారు.

కరోనాతో పాటు అప్పుల కారణంగా ఎల్ అండ్ టీ పై భారం రోజురోజుకి పెరిగిపోతుంది. మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా, వివిధ కారణాలతో రూ.18,971 కోట్లకు అంచనాలు చేరాయి. అయితే అప్పుల ద్వారా సేకరించిన మొత్తం రూ.13,500 కోట్లు ఉన్నాయి. 2019 – 20లో రూ.383 కోట్ల నష్టాలను చవిచూసింది. 2020 21లో ఏకంగా రూ.1,766 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ మేరకు సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ సంకేతాలిచ్చారు. పెద్ద ఇబ్బందులు మరీ తీవ్రంగా లేకపోయినా, కీలకేతర వ్యాపారాల నుంచి తప్పుకొని, ఆ నిధులను ఇతర కీలక వ్యాపారాలకు వినియోగించడం మంచిదని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడంతో కంపెనీకి అసలు, వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో భవిష్యత్తులోనూ ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు తక్కువ వడ్డీతో రూ.5 వేల కోట్ల రుణసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్‌ అండ్‌ టీ కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు రూ.4 వేల కోట్ల పెట్టుబడుల కోసం నేషనల్‌ ఇన్వెస్ట్మెంట్ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ తో జరుపుతున్న చర్చలు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. పెట్టుబడుల కోసం ఇతర కంపెనీలతో జరిపిన చర్చలు కూడా ఫలించలేదు.దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తన వాటాను అమ్మడానికి నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News