సుమలతకు బీజేపీ మద్దతు

Update: 2019-03-24 04:44 GMT
కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత  మాండ్య లోక్ సభ స్థానం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పై ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఆమెకు మద్దతుగా సినీ హీరోలు దర్శన్, యష్ లు ప్రచారం చేస్తున్నారు. దీంతో అధికార జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు పోటీ తయారైంది.

కాంగ్రెస్, జేడీఎస్ మాండ్యాలో నిఖిల్ కు మద్దతిస్తుండగా.. తాజాగా సుమలతకు ప్రతిపక్ష బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. 48 లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నడ్డా.. మాండ్యాలో సుమలతకు బీజేపీ మద్దతు ఇస్తోందని ప్రకటించారు.

గతంలో సుమలత భర్త అంబరీష్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మాండ్యా నియోజకవర్గంలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి గెలిచారు. అయితే పొత్తులో భాగంగా మాండ్యా సీటును కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు వదిలేసింది. సుమలత ఎంత కోరినా కాంగ్రెస్ ఇవ్వకుండా నిరాకరించింది. దీంతో సుమలత మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ మద్దతుతో ఇప్పుడు జేడీఎస్ కు గుబులు పుట్టుకుంది. సుమలత గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి.
    

Tags:    

Similar News