‘‘ఏపీ లోకల్’’ కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

Update: 2016-01-19 04:27 GMT
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్.. తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న సీమాంధ్రులు ఏపీకి తిరిగి వెళ్లిపోతే.. వారి స్థానికత ఏమిటి? అన్న ప్రశ్నకు చంద్రబాబు సర్కారు సమాధానాన్ని వెతికిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలో అంటే జూన్ 2, 2017 వరకు ఏపీకి వెళ్లే వారికి అక్కడి స్థానికత లభించేలా నిర్ణయం తీసుకున్నారు.

దీని అనుమతి కోసం కేంద్రానికి ఏపీ సర్కారు తన ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలు తొలుత కేంద్ర హోంశాఖకు వెళ్లాయి. అక్కడ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా పచ్చజెండా ఊపేయటంతో ఇప్పుడా ప్రతిపాదనల ఫైల్ ని న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఆ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాని పక్షంలో ఏపీ సర్కారు ప్రతిపాదనలే చట్టంగా మారనున్నాయి.

న్యాయశాఖ పరిశీలన.. ఆమోదం పొందిన వెంటనే ఈ ప్రతిపాదనలు అధికారిక ఉత్తర్వులు మారే వీలుందని చెబుతున్నారు. కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. స్థానిక హోదా విషయానికి సంబంధించి ఏపీ సర్కారు పంపిన ప్రతిపాదనపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం అయ్యే ఛాన్స్ లేదని.. త్వరలోనే స్థానికత మీద అధికారిక ఉత్తర్వులు జారీ కావటం ఖాయమన్నమాట వినిపిస్తోంది. ఇదే జరిగితే.. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగాయి. దీంతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీలోని ఎక్కడికైనా 2017, జూన్ 2 లోపుల వెళ్లే వెసులుబాటుతో పాటు.. వారు కోరుకున్న జిల్లా స్థానికత లభించే వీలు కలుగుతుంది.
Tags:    

Similar News