హత్రాస్​ ఘటన.. ఎస్పీ - డీఎస్పీ సస్పెన్షన్..ఆలస్యంగా మేల్కొన్న యోగి సర్కార్​

Update: 2020-10-03 08:10 GMT
హత్రాస్​ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్​ రాజీనామా చేయాలని విపక్షాలు, దళితసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో  హత్రాస్​ ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. సెప్టెంబర్ 14 న హత్రాస్‌లో దళిత యువతి(19)పై కొందరు సామూహిక లైంగకదాడికి పాల్పడటమే కాక.. ఆమెను చిత్రవద చేశారు. యువతి నాలుకకూడా కోసినట్టు వార్తలు వచ్చాయి.  చివరకు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి  ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్ ఆస్పత్రి లో కన్నుమూసింది. చివరికి యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకుండా పోలీసులే ఖననం చేయడం పై మానవ హక్కుల కమిషన్ కూడా మండి పడింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దళితసంఘాలు ఏకమై ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండించాయి.

 హత్రాస్​ ఘటనపై యోగి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.  ప్రభుత్వం నిందితులకు సహకరిస్తున్నదన్న ఆరోపణలు వినిపించాయి. మరోవైపు హత్రాస్​ జిల్లా వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బాధితకుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్​ నేతలు రాహుల్​, ప్రియాంకా గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పోలీసులు రాహుల్​పై అమర్యాదక ప్రవర్తించారని.. కాంగ్రెస్ నాయకుల దుస్తులు చింపారనే  ఆరోపణలు వచ్చాయి. అయితే ఆలస్యంగా మేల్కొన్న యోగీ సర్కార్​..  ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా హత్రాస్​ ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు హనీరాస్ కొత్త ఎస్పీగా వినీత్ జైస్వాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా ప్రస్తుతం హత్రాస్​లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హత్రాస్ జిల్లా సరిహద్దులను మూసివేశారు. జిల్లాలో ఒక నెల పాటు 144 సెక్షన్ ను విధించారు. హత్రాస్​ జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
Tags:    

Similar News