హా‌థ్రస్ ఫ్యామిలీని హైకోర్టుకు ఎందుకు తీసుకెళుతున్నారు?

Update: 2020-10-12 08:30 GMT
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన హాథ్ర‌స్ బాధిత కుటుంబాన్ని బ‌య‌ట‌కు తీసుకురానున్నారు. పందొమ్మిదేళ్ల ద‌ళిత మ‌హిళ‌ను అత్యంత దారుణంగా.. అనాగ‌రికంగా.. అమానుషంగా హ‌త్యాచారం చేసిన వైనం తెలిసిందే. ఈ ఉదంతం పెనుసంచ‌ల‌నంగా మారింది. ఇంత జ‌రిగినా.. స‌ద‌రు బాధితురాలిపై అత్యాచారం జ‌ర‌గ‌లేద‌న్నట్లుగా అధికారులు.. ప్ర‌భుత్వ వాద‌న‌గా నిల‌వ‌టం పెనువివాదంగా మారింది. దీనికి తోడు .. బాధితురాలి కుటుంబ స‌భ్యుల్ని మీడియా క‌ల‌వ‌కుండా ఆంక్ష‌లు విధించటం.. ఆ కుటుంబాన్ని నిందితుల త‌ర‌ఫున బ‌హిరంగంగానే వార్నింగ్ లు ఇవ్వ‌టం లాంటివి యోగి స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేశాయి.

బాధిత కుటుంబానికి పోలీసులు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌క‌పోవ‌టం చ‌ర్చ‌గా మారింది. భారీగా విమ‌ర్శ‌లు వ‌స్తున్న వేళ‌.. ఈ మ‌ధ్య‌నే పోలీసులు భారీ ఎత్తున బాధిత కుటుంబానికి ర‌క్షణ‌గా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల్ని అమ‌ర్చారు. వీరికి న్యాయం చేయాల‌న్న ఆందోళ‌న‌లు దేశ వ్యాప్తంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఈ రోజు ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. హాథ్ర‌స్ బాధిత కుటుంబం చాలా రోజుల త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట‌కు రానుంది.

అల‌హాబాద్ హైకోర్టు బెంచ్ ముందుకు వారు హాజ‌రుకానున్నారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య వారిని న్యాయ‌స్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. జ‌స్టిస్ పంక‌జ్ మిత్త‌ల్.. జ‌స్టిస్ రంజ‌న్ రాయ్ తో కూడిన డివిజ‌న్ బెంచ్ ఈ రోజు హాథ్ర‌స్ బాధితురాలి కుటుంబ స‌భ్యుల వాద‌న‌ను రికార్డు చేయ‌నుంది. ఈ కేసుకు సంబంధించి ప్ర‌భుత్వం త‌ర‌ఫున అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వీకే సాహి హాజ‌రుకానున్నారు.

ఈ రోజు అల‌హాబాద్ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ముందుకు బాధితురాలి కుటుంబంతో పాటు.. ప‌లువురు కీల‌క అధికారులు ఇదే కేసులో కోర్టు ముందుకు హాజ‌రు కావాల్సి ఉంది. యూపీ అద‌న‌పు చీఫ్ సెక్ర‌ట‌రీ హోం.. రాష్ట్ర డీజీపీ.. జిల్లా క‌లెక్ట‌ర్.. జిల్లా ఎస్పీలు కూడా హాజ‌రుకావాల్సి ఉంది. మరి.. న్యాయ‌స్థానం ఎదుట హాథ్ర‌స్ బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఏం చెప్ప‌నున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇంత కాలం వారి వాద‌న‌ను విన‌ని బ‌య‌ట ప్ర‌పంచం.. వారేం చెప్ప‌నున్నార‌న్న‌ది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతోంది.
Tags:    

Similar News