ఏపీ సీఎంకు ఉండవల్లిలో విశ్రాంతి గృహం!

Update: 2015-07-06 12:30 GMT
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. దీనిని ఇప్పటికే ఆయన లాంఛనంగా ప్రారంభించగా, భవనాలకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆషాడం వెళ్లిన తర్వాత శ్రావణంలో ఆయన దానిలోకి వ్రవేశించనున్నారు. అదే సమయంలో, రాజధాని ప్రాంతంలోనే ముఖ్యమంత్రికి విశ్రాంతి గృహం కూడా సిద్ధమవుతోంది. విజయవాడ సమీపంలోని ఉండవల్లి కరకట్టపై ఉండే అతిథి గృహంలో ఉండడానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి విశ్రాంతి గృహానికి వెళ్లే రహదారికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లా వైపు పాత జాతీయ రహదారికి ఇరువైపులా లోటస్‌ ఫుడ్‌ కోర్టు నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌ కాలువ గోడను బేస్‌ చేసుకుని కొండ మీది వరకు మార్కింగ్‌ చేశారు. ఇక్కడ సర్వే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. శ్రావణ మాసం వచ్చేలోపులోనే ఇక్కడ రహదారి పనులను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, పవిత్రమైన శ్రావణ మాసంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు క్యాంపు కార్యాలయంతోపాటు విశ్రాంతి గృహంలోనూ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. క్యాంపు కార్యాలయానికి ప్రారంభోత్సవం జరిగినా, విశ్రాంతి గృహానికి ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈ రెండూ పూర్తయితే ముఖ్యమంత్రి కార్యాలయాలు దాదాపు రాజధాని ప్రాంతానికి వచ్చేసినట్లే!!

Tags:    

Similar News