గ‌వ‌ర్న‌ర్ రిటర్న్స్‌... ఏం జ‌రిగిందంటే !?

Update: 2018-04-25 06:39 GMT
రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్ అనూహ్యంగా తిరుగుముఖం ప‌ట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో.. చంద్రబాబుతో గవర్నర్ భేటీ కావడం, ఆ వెంటనే గవర్నర్ ఢిల్లీ వెళ్లడం హోంమంత్రి - ప్రధానితో సమావేశం కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్న స‌మ‌యంలోనే ఆయ‌న హ‌ఠాత్తుగా తిరిగి ప్ర‌యాణం అయ్యారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన అనంత‌రం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధానితో సమావేశం కావాల్సి ఉండ‌గా ఆయ‌న తిరుగుప‌య‌నం కావ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఢిల్లీ వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్‌ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధానమంత్రి మోడీతో గవర్నర్‌ భేటీ కావాల్సింది. అయితే ఆయన అపాయింట్స్ క్యాన్సిల్‌ కావడంతో ఆయన ఇవాళ 12 గంటలకే హైదరాబాద్‌ కు తిరుగు ముఖం పట్టారు. ప్రధాని చైనా పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో.. ఆయన కీలక కార్యక్రమాల షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. దీంతో ప్రధాని - గవర్నర్‌ భేటీ క్యాన్సిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇతర మంత్రులతో జరగాల్సిన భేటీలు కూడా రద్దు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాలపై గవర్నర్‌ ఇప్పటికే తాను తయారు చేసిన నివేదికను ప్రధాని, హోం శాఖకు పంపినట్లు తెలుస్తోంది.

కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని ఆయన అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని... ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాల్సిన వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ అని... వార్తాపత్రికల్లో వచ్చేలా గవర్నర్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు.
Tags:    

Similar News