మిస్టరీ: ఆస్పత్రిలో భారీ పేలుడు.. 19మంది మృతి

Update: 2020-07-01 07:00 GMT
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఓ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19మంది సజీవ దహనమయ్యారు. ఉత్తర టెహ్రాన్ లోని ఓ క్లినిక్ లో గ్యాస్ లీక్ అయ్యి ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అనేకమంది గాయపడ్డారు.

సినా అథర్ మెడికల్ సెంటర్ లో మంగళవారం రాత్రి గ్యాస్ లీక్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో తొలుత 13 మంది చనిపోయినట్టు భావించారు.ఆ తర్వాత సహాయక చర్యల అనంతరం మరో ఆరు మృతదేహాలను గుర్తించినట్టు టెహ్రాన్ ఫైర్ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించాడు.

ఆసుపత్రి సెల్లార్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ల లీకై మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించాయని టెహ్రాన్ ఫైర్ విభాగం అధికార ప్రతినిధి  తెలిపారు. పై అంతస్తుల్లోని ఆపరేషన్ థియేటర్స్ లో కొంతమంది సిబ్బంది రోగులు ఉన్నారని.. వారంతా ఊపిరాడక చనిపోయారని తెలిపారు.

జనం భారీగా తరలిరావడంతో చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించారు.
Tags:    

Similar News