ప్రజాశాంతి వ్యూహానికి ఈసీ ఝలక్!

Update: 2019-03-26 13:13 GMT
అచ్చం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను కలిగి ఉన్న వారినే ఏరుకుని వచ్చి ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో నిలిపారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఏదో ఒక చోట అయితే యాధృచ్చికం అనుకోవచ్చు. కానీ ఏపీలో ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న పేర్లు ఉన్న వారిని ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు వేయించడం ఆసక్తిదాయకమైన అంశంగా మారింది.

అసలే ప్రజాశాంతి పార్టీ జెండా - ఆ పార్టీ గుర్తు కూడా వైసీపీని పోలి ఉన్నాయి. ఇక అభ్యర్థుల పేర్లు కూడా అలాగే ఉండటంతో ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగిందని స్పష్టం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను కొద్దోగోప్పో చీల్చడానికే ఇలా వైసీపీ అభ్యర్థుల పేర్లతో మ్యాచ్ అయ్యే వాళ్లను - వైసీపీ గుర్తుతో మ్యాచ్ అయ్యే గుర్తును తీసుకున్నారనే వాదనకు బలం చేకూరుతోంది.

ఇలాంటి నియోజకవర్గాల్లో ఒకటైన పెదకూరపాడులో అయితే మరింత విడ్డూరమైన కథ నడిచింది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంబూరి శంకర్ రావు అభ్యర్థిగా ఉన్నారు. విడ్డూరం ఏమిటంటే.. అదే ఇంటి పేరును - అదే ఒంటి పేరును కలిగి ఉన్న వ్యక్తి కేఏ పాల్ పార్టీ తరఫున నామినేషన్ వేశాడు! ఇది వైసీపీకి శరాఘాతం అనుకున్నారంతా.  అయితే నామినేషన్ల పరిశీలనతో పెదకూరపాడు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి అయ్యింది.  దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్టు అయ్యింది.

అయితే చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ఇబ్బంది ఉంది. ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో మ్యాచ్ అయ్యే వారి చేత నామినేషన్లు వేసిన దాఖలాలున్నాయి. వాటిల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసే సరికి పరిస్థితి ఎలా ఉంటుందో!
Tags:    

Similar News