జాతీయ విపత్తుగా కరోనా.. అమెరికా చరిత్రలో తొలిసారి

Update: 2020-04-12 10:02 GMT
అగ్రరాజ్యం అమెరికా కరోనాకు తలవంచింది.ఈ చైనీస్ వైరస్ ధాటికి ఇన్నేళ్లలో ప్రపంచపు పెద్దన్నగా ఎదిగిన అమెరికా కూడా దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘కరోనాను జాతీయ విపత్తుగా’ ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఇలా విపత్తుగా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మహా విపత్తుగా పరిస్థితులు నెలకొన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. తొలి కరోనా కేసు నమోదైన తర్వాత చిట్టచివరిగా శనివారం వ్యోమింగ్ రాష్ట్రానికి కరోనా వ్యాపించడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కరోనా చేరడంతో మహా విపత్తుగా ట్రంప్ ప్రకటించారు.

కరోనా జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఇక ఫెడరల్ ప్రభుత్వ నిధుల్ని రాష్ట్రాలు వినియోగించే వెసులుబాటు కలుగుతుంది. వైట్ హౌస్ నుంచి నిధులు రాష్ట్రాలకు అందుతాయి. అత్యవసర సేవలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది.

కొత్తగా వ్యోమింగ్ తోపాటు యూఎస్ విర్జిన్ ఐలాండ్ - ఉత్తర మెరినీ దీవులు - కొలంబియా - గౌమ్ - ప్యూర్టారికో సైతం కరోనా బారిన పడడంతో విపత్తును ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా మొత్తం ఇప్పుడు జాతీయ విపత్తు పరిధిలోకి రానుంది.

 ఆదివారంతో కరోనా మరణాల్లో ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలోకి వచ్చేసింది. అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలు దాటింది.మరణాలు 20వేలు దాటాయి.  24 గంటల్లోనే ఒక్క అమెరికాలోనే  2108 మంది మరణించారు. దీంతో ట్రంప్ జాతీయ విపత్తుగా ప్రకటించక తప్పలేదు.


Tags:    

Similar News