జనసేన-టీడీపీ కుమ్మక్కు.. ఇదిగో సాక్ష్యం

Update: 2019-04-12 10:36 GMT
జనసేన అభ్యర్థులంతా రాష్ట్రవ్యాప్తంగా చివరి నిమిషంలో టీడీపీకి సహకరించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు బాంబు పేల్చారు. శుక్రవారం విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో బాలక్రిష్ణ చిన్నల్లుడు  - టీడీపీ అభ్యర్థి భరత్ ను పక్కనపెట్టి జనసేన గెలిచేందుకు సహకరించాలని నారా లోకేష్ నేతలకు సూచించారని  ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు సంయమనంతో వ్యవహరించారని ప్రశంసించారు. మార్పు తీసుకొస్తున్నామన్న భావన ఓటర్ల ముఖాల్లో కనిపించిందని దాడి పేర్కొన్నారు.

ఓట్లు కొనేందుకు ప్రభుత్వ డబ్బును టీడీపీ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని దాడి వీరభద్రరావు ఆరోపించారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తించారని.. అధికారం ఉందని ఎన్నికల అధికారులను దబాయించారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే అసహనానికి గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50లక్షల మంది ఓట్లను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. పదవీ వ్యామోహంతోనే మరోసారి బాబు ఇలాంటి కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో పచ్చచొక్కలతో వెళ్లి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు అడిగారని తెలిపారు. అచ్చెన్నాయుడు - గంటా శ్రీనివాసరావులు రిగ్గింగ్ కు ప్రయత్నించారని ఆరోపించారు.

చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర బయటపడకుండా  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా అడ్డుపడ్డారని దాడి వీరభద్రరావు ఆరోపించారు. అదే సమయంలో బావ చాటు బాలయ్య చంద్రబాబు కోసం రెండు సినిమాలు తీసి భంగపడ్డారని ఎద్దేవా చేశారు.
   

Tags:    

Similar News