కరోనా సెకండ్ వేవ్ : జర్నలిస్టుల మరణ మృదంగం !

Update: 2021-04-28 04:41 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మ్రోగిస్తోంది. రాత్రి..పగలు అనే తేడా లేకుండా స్మశాన వాటికలలో చితి మంటలు ఆరని చిచ్చులా నిరాటంకంగా కాలుతునే ఉన్నాయి. అలాగే ప్రపంచమే వణికిపోయేలా రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఏదైనా అనుకోని సమస్య  వచ్చినప్పుడు అత్యవసర శాఖకు చెందిన అధికారులకు రెట్టింపు పని ఉంటుంది. వారికి ప్రభుత్వ రక్షణ ఉంటుంది. కానీ, జర్నలిస్టులకు అలాంటి పరిస్థితి ఉండదు. జరగరానికి ఏదైనా జరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు ఎన్నో విపత్తులకు ఎదురొడ్డి పని చేసిన జర్నలిస్టులకు తొలిసారి కరోనా రూపంలో పెద్ద ముప్పు వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కరోనా సెకండ్ వేవ్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారు.

సాధారణంగా పాత్రికేయ రంగంలో మరణాలు తక్కువగానే ఉంటాయి. దీనికి ప్రధాన జర్నలిస్టుల సగటు వయసు తక్కువగానే ఉంటుంది. ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన వారు చాలామంది పది ,పదిహేనేళ్ల తర్వాత మరో రంగంలోకి వెళ్లిపోతారు. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే ఈ రంగంలో ఎక్కువ కాలం ఉండలేరు అనే భావన ఉంది. అయితే, అందరూ అలానే ఉండరు. ఎక్కువమంది ఇదే ధోరణిలో ఉంటారు. ఈ కారణంగా పెద్ద వయస్కులు తక్కువగానే ఉంటారు. చాలావరకు యువకులు, మధ్యవయస్కులే ఈ ఫీల్డ్ లో ఎక్కువ. సెకండ్ వేవ్ కవరేజ్ విషయమై యాజమన్యాలు కఠినంగా ఉండటం, వారు పెట్టిన టార్గెట్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో  ముందుకుసాగుతూ కరనా బారిన పడుతున్నారు.
Read more!

ప్రింట్ మీడియా కొంతవరకు ఫర్లేదుకానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో విజువల్స్ కోసం, బైట్ల కోసం కరోనా రోగులకు దగ్గరగా, కరోనాకు మరింత దగ్గరగా వెళుతున్న వారు దాని బారిన పడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం, తమకేం కాదన్న భరోసాతో కూడిన నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. ఈ కారణంతోనే రోజుకు కనీసం ఒకరు,గరిష్ఠంగా ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో కొత్త కలకలం రేగుతోంది. ఈ సెకండ్ వేవ్ లో యాజమాన్యాలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే.. జర్నలిస్టు దుస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. అలాగే బైట్ల కోసం వెళ్లే  జర్నలిస్టులు కూడా కరోనా నియమాలని పాటిస్తూ , మాకేం కాదులే అన్న భ్రమ నుండి బయటకి వచ్చి జాగ్రత్తగా వ్యవహరించాలి.
Tags:    

Similar News