డిగ్గీ రాజా పదవి ఊడుతుందా...?

Update: 2015-07-17 11:07 GMT
    తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.  అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలో నాయకత్వ మార్పులకూ శ్రీకారం చుట్టింది. అయితే... ఆ తరువాత కూడా తెలంగాణలో వలసలు ఆగలేదు... ఏకంగా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాసే టీఆరెస్ లో చేరారు. మరోవైపు ఏపీలోనూ పీసీసీ మాజీ చీఫ్ బొత్స కాంగ్రెస్ ను వదిలేశారు. ఇలాంటి పరిస్థితిలో రెండు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడవని అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకు రెండు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు కంటే కూడా ఈ రాష్ట్రాల వ్యవహారాలను చూస్తున్న నాయకుడినే మార్చాలని నిర్ణయించారట.  రెండు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జుగా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌పై ఢిల్లీకి విపరీతంగా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రంగం సిద్ధమవుతోంది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు నుంచి కూడా దిగ్విజయ్‌సింగ్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ఉన్నారు. విభజన తరువాతా ఆయనే ఈ బాధ్యతలు చూస్తున్నారు. కానీ రెండు రాష్ట్రాల నేతల మధ్య విభేదాలు, ఇతరత్రా సమస్యలపై దిగ్విజయ్‌ పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇంఛార్జులను నియమించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తుంది. ఈ సారి జరగబోయే ఏఐసిసి పునర్ వ్యవస్థీకరణలో ఏపీ, తెలంగాణలకు కొత్త బాధ్యులుగా ఎవరి నియమించాలా అని ఆలోచిస్తోంది.  సీనియర్‌నేతలు అంబికాసోని, బికె హరిప్రసాద్‌, ముకుల్‌ వాస్నిక్, అహ్మద్‌ పటేల్‌ పేర్లు చర్చకొస్తున్నాయి.
Tags:    

Similar News