కేసీఆర్‌ పై అవిశ్వాసం?!

Update: 2016-12-14 19:30 GMT
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల‌కు టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు సిద్ధ‌మ‌వుతున్నట్లే ప్ర‌తిప‌క్షాలు సైతం త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ మ‌రింత దూకుడు నిర్ణ‌యం తీసుకోనుంద‌ని స‌మాచారం. టీఆర్‌ ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన క్ర‌మంలో ఈ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వపాలన తీరుపట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలుచేయ లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వ‌ర్గాల స‌మాచారం.

శాస‌న‌స‌భా శీతాకాల స‌మావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈ నెల 15న సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులోనే రెండున్నరేళ్ల‌ ప్రభుత్వ పాలనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై చర్చించనున్నట్టు తెలిసింది. సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ రోజు సాయంత్రమే అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందజేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని గతంలోనే కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది.

ప్రభుత్వం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీని జరిపి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో 120 మంది సభ్యులుంటే, అందులో 85 మంది వరకు టీఆర్‌ ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు, దానికి మద్దతు తెలపడానికి పదిమంది సభ్యులు లేచి నిలబడితే చాలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 24 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ప్ర‌స్తుతం కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వల్ల రెండు - మూడు ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు అసెంబ్లీని కోరింది. దానికి ఆరునెలలు గడువు కూడా ఇచ్చింది. త్వరలోనే ఆ గడువు ముగియనుంది. స్పీకర్‌ సుప్రీంకోర్టు సమాచారాన్ని అందజేయాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానం ఇస్తే కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయనుంది. విప్‌ ను ధిక్కరించకుండా ప్రతి ఒక్కరూ సభకు హాజరుకావల్సి ఉంది. గైర్హాజర్‌ అయినా, అనుకూలంగా మద్దతు తెలపకపోయినా అలాంటి వారిపై వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా కోరే అవకాశం ఉంది. దీని ఆధారంగా అధికారపార్టీని ఇబ్బందుల్లో పెట్టవచ్చు అన్నది ప్రతిపక్షపార్టీ ఆలోచనగా ఉంది. తీర్మానం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సమయం రానుంది. ఈ సమయంలో అధికారపార్టీ నేతలు అడ్డుతగిలే అవకాశం కూడ ఉండదు. ఈ రకంగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని వాడుకోవచ్చు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మిగతా ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ఉన్నారని స‌మాచారం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News