ఇంచార్జ్ మంత్రి ఎఫెక్ట్‌: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల సిగ‌ప‌ట్లు

Update: 2022-01-15 06:30 GMT
ఆయ‌న మంత్రి. అంతేకాదు.. క‌ర్నూలు జిల్లాకు ఇంచార్జ్ మంత్రి. ఆయ‌నే ఇరిగేష‌న్ శాఖామాత్యులు అనిల్‌కుమార్ యాద‌వ్‌. అంటే.. ఇక్క‌డి నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త పెంచాల్సిన అవ‌స‌రం ఆయ‌న ప్ర‌ధాన బాధ్య‌త‌. అయితే.. ఆయ‌న చేస్తున్న య‌వ్వారంతో పార్టీ ప్ర‌తిష్టకు గండి ప‌డ‌డంతోపాటు.. నేత‌ల మ‌ధ్య విభేదాలు కూడా తార స్థాయికి చేరాయ‌నే టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి ఆది నుంచి క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్య పోరు సాగుతోంది. పార్టీ ఇంచార్జ్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. కానీ, ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆర్థ‌ర్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు.

అంతేకాదు.. ఆది నుంచి కూడా ఆర్థ‌ర్ పార్టీలోనే ఉన్నారు. కానీ, సిద్ధార్థ రెడ్డి మాత్రం మ‌ధ్య‌లో వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. అంతా నాదే అంటూ.. ఆయ‌న హ‌వా చ‌లాయిస్తున్నార‌ని ఆర్థ‌ర్ ఆది నుంచి ఫిర్యాదులు చేస్త‌న్నారు. దీనిపై అనేక సార్లు పంచాయితీలు కూడా సాగాయి. అయిన‌ప్ప‌టికీ.. వివాదాలు ర‌గులుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో వివాదాలు సర్దు బాటు చేయ‌డంతోపాటు.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త పెంచేలా.. మంత్రిని ఇక్క‌డ జిల్లా ఇంచార్జ్‌గా వైసీపీ అధిష్టానం నియ‌మించింది. అయితే.. ఆయ‌న జిల్లా మొత్తాన్ని వ‌దిలేసి.. కేవ‌లం నందికొట్కూరు పైనే దృష్టి పెట్టార‌నే వాద‌న ఉంది.

పోనీ.. నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టినా.. వివాదాల‌కు చెక్ పెట్టేలా మంత్రాంగం ఏమైనా చేస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. పైగా సిద్ధార్థ రెడ్డికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. ఆర్థ‌ర్ వ‌ర్గం ఆరోపిస్తోంది. అభివృద్ధి పనుల కేటాయింపు, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో సీట్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్‌ల నియామకం వంటి విషయాల్లో బైరెడ్డి సిద్దార్ధరెడ్డి వర్గీయులకే  పెద్దపీట వేశారనే వాద‌న వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గాన్ని అనిల్‌ దూరం పెట్టారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికల సమయంలోనే సీట్ల సర్దుబాటు విషయంగా కర్నూలులో మంత్రుల సమక్షంలోనే పంచాయితీ జరిగింది.

ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీట్ల విషయంలో లెక్కలు కొలిక్కిరాక బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు బాహాబాహీకి దిగారు. మంత్రుల కళ్లెదుటే సీట్ల కోసం ఘర్షణకు దిగడంతో వారు ఒకింత షాక్‌కు గురయ్యారు. మంత్రి అనిల్ కుమార్... బైరెడ్డి సిద్దార్ధరెడ్డి వర్గానికి సపోర్టుగా ఉండటమే ఘర్షణకు కారణమని అప్పట్లో జిల్లా వైసీపీలో జోరుగా చర్చ జరిగింది.

ఇక పంచాయతీ, పరిషత్ ఎన్నికలప్పుడు కూడా బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నికల తర్వాత కూడా అప్పుడప్పుడు ఇరువర్గాల మధ్య ఏదో ఒక విషయంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అనిల్ కుమార్ నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలకు మంత్రి అనిల్ చెక్ పెడతారని పార్టీ శ్రేణులు, ప్రజలు భావించారు. అయితే మంత్రి అనిల్ పర్యటనలో వారి అంచనాలు తలకిందులయ్యాయి. మంత్రి ప్రోగ్రామ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోలు కనిపించలేదు. దీంతో ఆయన వర్గీయులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

మంత్రి అనిల్ పర్యటనకు ఎమ్మెల్యే ఆర్థర్‌ను కూడా పిలవలేదనే చర్చ జరుగుతోంది. అనిల్ వ్యవహారశైలి నచ్చకనే ఎమ్మెల్యే ఆర్థర్ సైతం మంత్రి పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లలేదట. ఇలా నందికొట్కూరు వైసీపీలో ఇద్దరు కీలక నేతల వర్గీయులు నువ్వెంత అంటే- నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మ‌రి ఈ వివాదాల‌కు ఇప్ప‌టికైనా మంత్రి చెక్ పెడ‌తారా?  లేక ఇంకా పెంచుతారా? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News