ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకి రూ.50వేలు పరిహారం

Update: 2021-09-24 08:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా కరోనాతో చాలా మందే మృతిచెందారు. కరోనాతో మృతిచెందినవారిలో ధనికులు, పేదలు కూడా ఉన్నారు. కరోనాతో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే వారికి పరిహారం అందజేయాలనే డిమాండ్ వినిపింది. దీనితో కరోనా తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సిఫార్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ పరిహారాన్ని రాష్ట్రాలు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ నుంచి చెల్లించాలని పేర్కొంది.

దీనితో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కరోనా వైరస్ మృతుల కుటుంబాలకు పరిహారం అందనుంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొన్ని ప్రాణాలు కోల్పోయిన వారిక కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారని, అవి పొందిన కుటుంబాలకే పరిహారం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో కరోనాతో మరణించినవారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, కరోనా సోకడంతో ఆందోళన చెందిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాలు కూడా పరిహారం పొందేందుకు అర్హలేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

కరోనా వైరస్ పాజటివ్ రిపోర్ట్ వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు పరిహారం పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. దీంతో కరోనా పాజటివ్‌ గా తేలడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ కూడా రూ. 50వేల పరిహారం అందించనున్నట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పునఃపరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం అఫిడవిట్ దాఖలుచేసింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌ డీఆర్‌ ఎఫ్‌) కింద పరిహారం పొందడానికి అర్హులే.

కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు 30 రోజుల్లోగా పరిహారం అందుతుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం బాధిత కుటుంబాలు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన సర్టిఫికేట్స్ జత చేయాల్సి ఉంటుంది. వాటిని జిల్లా అధికారుల కమిటీ తనిఖీ చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్‌, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి.. ఈ కమిటీ చేసే సిఫార్సు మేరకు పరిహరం చెల్లించనున్నారు.


Tags:    

Similar News