‘నకిలీ చెక్కుల’ పై ఏసీబీ విచారణకి సీఎం ఆదేశాలు !

Update: 2020-09-21 08:30 GMT
ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి నకిలీ చెక్కుల ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.  నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీనిపై ఏసీబీతో  వెంటనే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీచేశారు.  

ఏపీకి చెందిన సీఎంఆర్ ‌ఎఫ్‌ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ  చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా, లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ ‌ఎఫ్‌ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా..  అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్‌ అండ్‌ ఇంటర్‌ లాక్స్, మల్లాబ్ ‌పూర్‌ పీపుల్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ, శర్మ ఫోర్జింగ్‌ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. సీఎంఆర్ ‌ఎఫ్‌ నుంచి రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీనిలో భాగంగా కర్నాటక, ఢిల్లీ, కోల్‌కతా కు చెందిన ముగ్గురు వ్యక్తులు మంగళూరు మూడ్ ‌బద్రి శాఖ లో రూ.52.65 కోట్లు, ఢిల్లీ లోని సిసిపిసిఐ కి రూ.39.85 కోట్లు, కోల్‌కతా సర్కిల్ ‌లోని మెగ్ ‌రాహత్‌ శాఖ లో రూ.24.65 కోట్ల విలువైన చెక్కులను వేశారు. క్లియరెన్స్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్ ‌లోని వెలగపూడి శాఖకు అక్కడి శాఖ అధికారులు ఫోన్‌ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కాగా, సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. 
Tags:    

Similar News