బాబు జీవిత కాలం లేటు!

Update: 2018-03-30 14:30 GMT
చంద్ర‌బాబు నాయుడు ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ. కానీ ఆయ‌న టైమింగ్ మాత్రం టూ బ్యాడ్ అని బాధ‌ప‌డుతున్నారు ఏపీ జ‌నం. మోడీ మొండి చేయి చూపుతున్నాడు గ‌ట్టిగా అడ‌గండి బాబూ అని ఎవ‌రైనా అంటే ఇంత‌కాలం *కేంద్రంతో స‌ఖ్య‌త వ‌ల్ల రాష్ట్రానికి మేలు, మీకేం తెలుసు. సీనియర్‌ని రాష్ట్రానికి ఏం చేయాలో, ఎపుడు చేయాలో నాకు తెలియ‌దా?* అంటూ తిరిగి ప్ర‌శ్న వేస్తారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.  కానీ బాబు అర్థం చేసుకోవాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయి. అన్నిటికీ అనుభ‌వంతోనే ముడిపెడితే చాలా తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది. తాజా ఉదాహ‌ర‌ణే తీసుకుందాం. ఈరోజు టాలీవుడ్ ప్రముఖులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. అఖిలపక్షం పిలుపు మేరకు తాము కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ముఖ్య‌మంత్రికి చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. బాబును క‌లిసిన వారిలో కే రాఘవేంద్ర రావు, కేఎల్ నారాయణ, జీకే, సీ అశ్వనీదత్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ తదితర  సినిమా పెద్ద‌లున్నారు. అస‌లు వీళ్లు ఇపుడు క‌లిశారు. మొన్న ప‌వ‌న్ వంత పాడారు. అసలు ఇది ముందే మొద‌లై ఉంటే ఎలా ఉండేది. రాష్ట్రం ప‌రిస్థితి ఇంకోలా ఉండేది.

ఇదే తీవ్ర‌త‌తో ఇంతే వేగంగా ఇపుడు ఎందుకు బాబు పోరాడుతున్నారో ఎవ‌రికి మాత్రం అర్థం కాదు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. స‌ఖ్య‌త పేరు చెప్పి ఎందుకు మోడీతో గొడ‌వ‌లు అనుకున్న చంద్ర‌బాబు బీజేపీతో క‌లిసి ఉంటే త‌న పుట్టి మునిగే ప్ర‌మాదం ఉంద‌ని తెలిశాక ఆ పార్టీని వ‌దిలేశారు. ఒక‌వేళ ఇదే ప‌ని రెండు మూడేళ్ల క్రితం చేసి అంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి ఉంటే బాబు హీరో అయ్యేవాడు. గ‌ట్టిగా కూర్చుంటే కేంద్రం కూడా దిగొచ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉండేది. అయినా ఆర్థిక సంఘం చెప్పింది హోదాలు ఇవ్వ‌కూడ‌ద‌ని ఆయనెవ‌రో మంత్రి చెబితే... అది నిజ‌మా? కాదా? అని ఏపీ సీఎం గా చంద్ర‌బాబుకు ఎందుకు అనుమానం రాలేదు. అబ‌ద్ధం చెప్ప‌డానికి చిన్న విష‌య‌మా అది? అయినా ఒక ముఖ్య‌మంత్రికి అలా ఎలా చెబుతారు అని ఇపుడు  కోర్టుకు కూడా వెళ్లొచ్చు గ‌ట్టిగా మాట్లాడితే! పోరాటాల వ‌ల్ల కేంద్రంతో స‌ఖ్య‌త చెడింది అనుకుందాం... కేంద్రం చూపిన ప‌క్ష‌పాతాన్ని లెక్క‌ల‌తో స‌హా కోర్టుల్లో ఎండ‌గ‌ట్ట‌వ‌చ్చు. ప్ర‌జ‌ల ముందుపెట్టొచ్చు.

మొన్న అసెంబ్లీలో వ‌చ్చిన ఐడియాను ముందే అమ‌లుచేసి ప్ర‌జ‌ల‌తో అప్పులు తీసుకుని మ‌న రాజ‌ధాని, మ‌న ప్రాజెక్టులు మ‌న‌మే క‌ట్టుకునే ధైర్యం కూడా అపుడే చేసి ఉండేవాళ్లం క‌దా. బాండ్లు జారీ చేయ‌డం అనేది బాబు గారి కొత్త ఐడియా కాదు. ఆ విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. మోడీ నువ్వు మాట నిల‌బెట్టుకుంటావా? లేదా? మమేమేంటో నిరూపిస్తాం అని ఆ రోజే పోరాడి ఒక ప్ర‌జా ఉద్య‌మాన్ని నిర్మించి ఉంటే రాష్ట్రం ప‌రిస్థితి ఇంకోలా ఉండేది. కానీ... చంద్ర‌బాబుకు అంతా బాగుంది అనుకున్న‌పుడు ఆయ‌న‌కు ఇవన్నీ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఈరోజు చెడింది కాబ‌ట్టి ఫ‌క్తు రాజ‌కీయ‌నేత‌గా త‌న పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో రాష్ట్రం బాగుప‌డ‌నూ వ‌చ్చు. ఇంకా అన్యాయానికి గురికానూ వ‌చ్చు.
Tags:    

Similar News